కాంగ్రెస్తో పొత్తు: అందుకే టీటీడీపీ పైనే చంద్రబాబు భారం, ఈ సీట్లు అడుగుదాం..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి అమరావతి బయలుదేరారు. శనివారం, ఆదివారం తెలంగాణ ప్రాంతానికి చెందిన పార్టీ నేతలతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఏం చేయాలనే విషయమై దిశానిర్దేశనం చేశారు.
చదవండి: కేసీఆర్ తర్వాత తెలంగాణలో ఏపీ సీఎం రికార్డ్!: చంద్రబాబుకు ఉత్తమ్ 15 సీట్లు ఆఫర్
ఎన్నికల నిర్వహణ, పొత్తులపై పార్టీ నేతలతో చర్చించారు. పొత్తులు, మేనిఫెస్టో తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. కాంగ్రెస్తో పొత్తుపై చంద్రబాబు తేల్చేస్తారని మొదట ప్రచారం సాగింది. కానీ ఆ పార్టీతో పొత్తు బాధ్యతను తెలుగుదేశం పార్టీ నేతల పైనే వేశారు. పొత్తులు, సీట్లపై ఈ రోజు సాయంత్రానికి స్పష్టత వచ్చేలా చూడాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు. దీంతో వారు మరోసారి భేటీ కానున్నారు.
చదవండి: కూతురు కోసం పట్టు: 12న కాంగ్రెస్లోకి కొండా సురేఖ! అందుకే కేసీఆర్ తీవ్ర అగ్రహం

ఎవరితో పొత్తు మంచిది, ఎక్కడ పోటీ చేయాలి?
చంద్రబాబు శనివారం, ఆదివారం ఉదయం తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నామా నాగేశ్వర రావు తదితరులతో జూబ్లీహిల్స్లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది, పొత్తు పెట్టుకుంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశాలపై నేతల అభిప్రాయాలు సేకరించారు. ఏయే స్థానాల్లో పోటీ చేయాలని, ప్రచారంలో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయాలపై చర్చించారు. చివరగా సీట్లు, పొత్తుల బాధ్యతను తెలంగాణ నేతలకే వదిలేశారు. కాగా, చాలాకాలం పాటు టీడీపీకి దూరంగా ఉన్న మండవ వెంకటేశ్వర రావు కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారని తెలుస్తోంది.

అందుకే చంద్రబాబు దూరం..
కాంగ్రెస్ పార్టీతో దాదాపు పొత్తు తేలిపోయిందని అంటున్నారు. అయితే ఆ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అదే పార్టీతో జతకడుతుంటే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేరుగా ప్రకటిస్తే బాగుండదని ఊరుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ - టీడీపీ కలిసి వెళ్లడం దాదాపు ఖాయమంటున్నారు. నేడో, రేపో అధికారికంగా కాంగ్రెస్, టీడీపీ (తెలంగాణ) నేతలు చర్చించి పొత్తుపై ప్రకటన చేయవచ్చునని అంటున్నారు. తన సమక్షంలో కాంగ్రెస్తో పొత్తు, తాను తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపితే ఏపీలో నష్టం జరుగుతుందనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు దూరం జరిగినట్లుగా తెలుస్తోందని అంటున్నారు.

ఖమ్మం, మల్కాజిగిరిల కోసం పట్టుబట్టాలని
టీడీపీకి తెలంగాణలో మంచి పట్టు ఉందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు రాబట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారని తెలుస్తోంది. 17 లోకసభ స్థానాలకు గాను రెండు అంతకంటే ఎక్కువ స్థానాలు అడగాలని చంద్రబాబుతో భేటీ సందర్భంగా నాయకుల మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. ఖమ్మం, మల్కాజిగిరిలో టీడీపీకి పట్టు ఉన్నందున, ఈ సీట్లు కచ్చితంగా అడగాలని నిర్ణయించారని తెలుస్తోంది.

టీడీపీకి మంచి పట్టు ఉన్నందున
అలాగే, దాదాపు నలభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి మంచి పట్టు ఉన్నందున, ఎక్కువ సీట్లు అడగాలని సూచించారని తెలుస్తోంది. రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్.. ఇలా పలు ప్రాంతాల్లో టిక్కెట్లు అడగాలని నిర్ణయించారు. బలమైన నేతలకు టిక్కెట్లు ఇవ్వాలని చెప్పారు. చంద్రబాబు తెలంగాణ కోసం మూడు కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. సాయంత్రంలోగా కమిటీలు ఖరారు చేయాలన్నారు. ఎన్నికల సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీ వేయనున్నారు. కలిసివచ్చే పార్టీలతో సంప్రదింపులు వేగవంతం చేయనున్నారు. కాంగ్రెస్తో పాటు సీపీఐ, టీజేఎస్ (కోదండరాం పార్టీ)లతో చర్చలు జరపనున్నారు. నేటి సాయంత్రం సీపీఐ నేతలతో, రేపు (సోమవారం) కోదండరాంతో చర్చించే అవకాశముంది.












Click it and Unblock the Notifications