వరంగల్లో తిట్టలేక!: కెసిఆర్ ఎఫెక్ట్, తప్పుకున్న బాబు? సొంత నేతల అసంతృప్తి
వరంగల్/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్డీయే కూటమి (బిజెపి - టిడిపి) అభ్యర్థి దేవయ్య తరఫున ప్రచారం చేస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్, బిజెపి, వైయస్సార్ కాంగ్రెస్, వామపక్షాలు నేతలు, అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయన పార్టీల అగ్రనేతలు ప్రచారంలో దూసుకు పోతున్నారు. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ కూడా నాలుగు రోజుల పాటు వరంగల్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేస్తారు.
అయితే, వైసిపి కంటే బలంగా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం ఎన్డీయే కూటమి అభ్యర్థి తరఫున ప్రచారానికి వచ్చే పరిస్థితులు లేవు. అందుకు చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల పరిణామాలు కూడా అందుకు తోడయ్యాయని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తునే గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణ బిజెపి నేతలు వ్యతిరేకించారు. చంద్రబాబుకు, టిడిపికి తెలంగాణ వ్యతిరేక ముద్ర ఉందని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రచారానికి బిజెపి నేతలు కూడా ఏమాత్రం సుముఖంగా లేరని చెప్పవచ్చు.
మరోవైపు, ఇటీవల తెలంగాణ సిఎం కెసిఆర్, చంద్రబాబులు దగ్గరయ్యారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ తదితర పరిణామాల నేపథ్యంలో... ఇటీవలే అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఇరువురు కలిసిపోయారు!
ఇటీవల తెలంగాణ టిడిపి నేతలతో విజయవాడలో భేటీ అయిన సమయంలోను చంద్రబాబు... పలు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. తాను అమరావతిలో ఉండవలసి ఉందని, తెలంగాణ టిడిపి నేతలు కోరుకున్నట్లు హైదరాబాదులో మరింత కాలం ఉండేందుకు అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.
అంతేకాదు, కెసిఆర్తో లేదా తెలంగాణతో కలిసి ముందుకు సాగాల్సిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో ప్రజా సమస్యల పైన తెలంగాణ టిడిపి నేతలు స్పందిచాలని, మీరే పార్టీని బలోపేతం చేసుకోవాలని సూచించారని చెబుతున్నారు. తెలంగాణ తన జోక్యం తక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం.
ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఎన్డీయే (బిజెపి - టిడిపి) కూటమి అభ్యర్థిగా బిజెపి ప్రకటించిన దేవయ్య పోటీ చేస్తున్నారు. ఆయన బిజెపి ప్రకటించిన అభ్యర్థి కావడంతో చంద్రబాబుకు కొంత ఊరటే అని చెప్పవచ్చు.
టి బిజెపి నేతలు కూడా బాబు ప్రచారంపై ఆసక్తిగా లేరు. దీంతో చంద్రబాబు ప్రచారానికి రాకపోయినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదు. అయితే, చంద్రబాబు ఎన్డీయే కూటమి అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తేనే టిడిపికి లాభిస్తుందని, అది అభ్యర్థికి లాభం చేకూర్చుతుందని తెలంగాణ టిడిపి నేతలు భావిస్తున్నారు.
బిజెపి ఆసక్తి చూపించక పోవడం, ఇప్పుడిప్పుడే కెసిఆర్తో సంబంధాలు మెరుగుపడుతున్న పరిస్థితుల్లో ప్రచారం వద్దని చంద్రబాబు లేదా టిడిపి కూడా భావిస్తోందని తెలుస్తోంది.
ఒకవేళ చంద్రబాబు వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయవలసి వస్తే... తప్పనిసరిగా కెసిఆర్ను, ఆయన పాలనను విమర్శించవలసి ఉంటుంది. ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న కెసిఆర్ - బాబుల మధ్య ఇది వేడి రాజేస్తుందని, అందుకే ప్రచారం చేయక పోవడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తీరు తెలంగాణ టిడిపి నేతలకు మాత్రం చిక్కులేననే వారు లేకపోలేదు.