ఫిబ్రవరి నుంచి చంద్రబాబు తెలంగాణ పర్యటన
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి మొదటి వారం నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లా నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. స్వయంగా పార్టీ అధ్యక్షుడే వచ్చి పాల్గొంటే కార్యకర్తల్లో ఉత్సాహం వస్తుందన్న ఉద్దేశంతో బాబు తెలంగాణలో పర్యటించాలని పార్టీ నేతలు కోరారు. దీంత, సోమవారం రాత్రి తెలంగాణ టీడీపీ నేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ విషయం ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ జిల్లాల్లో చంద్రబాబు ఇంతవరకూ పర్యటించలేదు. తెలంగాణలో పార్టీకి ఉత్తేజం కల్పించే లక్ష్యంతో చంద్రబాబు ఈ పర్యటనలకు సిద్ధమయ్యారు. నెలకు రెండు మూడు జిల్లాల చొప్పున మొత్తం పది జిల్లాల్లోనూ పర్యటించాలని నిర్ణయించారు. బహిరంగ సభలు కాకుండా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇటీవల జరిగిన కంటోన్మెంట్ ఎన్నికలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది.

కంటోన్మెంట్ ఎన్నికలు ఏకపక్షంగా జరగలేదని, టిఆర్ఎస్ కూడా సగం సీట్లకు మించి గెలవలేకపోయిందని, కొంత ముందుగా ప్లాన్ చేసుకొని ఉంటే టీడీపీకి కూడా రెండు సీట్లు వచ్చేవని, ఎన్నికల్లో జయాపజయాలు సహజమని, ఆత్మ విశ్వాసంతో పని చేసుకొంటూ వెళ్ళాలని చంద్రబాబు వారికి సూచించారు. ఆంధ్ర, రాయలసీమల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం టిఆర్ఎస్ మాదిరిగానే టిడిపి నుంచి అనేక మంది నేతలను చేర్చుకొందని, అయినా ఎన్నికల్లో గెలవలేకపోయింని చంద్రబాబు తెలంగాణ టిడిపి నేతలతో అన్నారు.
టిడిపి టిక్కెట్పై గెలిచిన తలసానికి దమ్ముంటే తన ఎమ్మెల్యే పదవికి ఇచ్చిన రాజీనామాను ఆమోదింపచేసుకుని మళ్లీ పోటీ చేయాలని ఎర్రబెల్లి సవాల్ చేశారు. తెలంగాణలో జనవరి 30వ తేదీ నుంచి టీడీపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించనున్నట్టు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తెలిపారు. టిడిపి జాతీయ పార్టీగా మారినందున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకేసారి పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications