కెసిఆర్ వర్సెస్ బాబు: ఆలయాల నుంచి రాజధాని.. హైటెక్ బస్సుల వరకు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రతి విషయంలో పోటీ పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్విన్ సిటీస్ నుంచి దేవాలయాల వరకు, లగ్జరీ బస్సుల నుంచి ఉద్యోగుల జీతాల పెంపు వరకు పోటీ పడుతున్నారంటున్నారు.
విభజన అనంతరం తెలంగాణలో కెసిఆర్, ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి సహా పలు విషయాల్లో ఇరువురు నేతలు కూడా పోటాపోటీగా ముందుకు సాగుతున్నారు. ఒకరికి ఏం ఉంటే మరొకరు దాని కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే చెప్పవచ్చు.
ఉద్యోగుల సమ్మె
కొద్ది నెలల క్రితం ఏపీలో ఏపీ ఎన్జీవోలు, తెలంగాణలో టీఎన్జీవోలు ఫిట్మెంట్ కోసం ధర్నాలు చేశారు. రెండు ప్రభుత్వాలు పోటాపోటీగా పెంచాయి. ఆ తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల ఛార్జీల పెంపు విషయంలోను అదే కనిపించింది.
ప్యాకేజీ
విభజన నేపథ్యంలో ఏపీ ఎక్కువగా నష్టపోయిందని, తమకు ఎక్కువ ప్యాకేజీ, హోదా కావాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. ఏపీ డిమాండును తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించింది. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణ కూడా డిమాండ్ చేయవచ్చుననే వాదనలు వచ్చాయి. ఇప్పుడు ఏపీకి ప్యాకేజీ పైన హామీ లభించింది. అది వెల్లడయ్యాక తెలంగాణ కూడా అలాంటి ప్యాకేజీనే డిమాండ్ చేయవచ్చునని అంటున్నారు.
రాజధానులు
రాజధాని అభివృద్ధి విషయంలోను ఇరువురు సీఎంలు పోటీ పడుతున్నారు. హైదరాబాదు టిడిపి హయాంలోనే అభివృద్ధి చేశామని చంద్రబాబు నిత్యం చెబుతుంటారు. అదే తరహాలో, ప్రపంచస్థాయి రాజధానిని ఏపీకి నిర్మిస్తామని చెబుతున్నారు.
ఇందుకోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసింది. విజయ దశమి నాడు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. అద్భుత రాజధానిని నిర్మించేందుకు ఏపీ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాదును మరింత అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలకు శ్రీకారం చుట్టింది.
భాగ్యనగరంలో బహుళ అంతస్థుల భవనాలు, మల్టీలెవల్ కాంప్లెక్సులు, భారీ వంతెనలు నిర్మిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. అదే సమయంలో సచివాలయాన్ని కూడా ఆదునాతనంగా నిర్మించాలని భావించింది.
యాదగిరి గుట్ట వర్సెస్ తిరుమల!
చిత్తూరు జిల్లాలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన కలియుగ ప్రత్యక్ష దైవం. దానికి ధీటుగా తెలంగాణలోని యాదగిరి గుట్టను తీర్చిదిద్దాలని కెసిఆర్ భావిస్తున్నారు. తిరుమలకు ఏడు కొండలు ఉంటాయి. యాదగిరిగుట్టకు యాదాద్రి అని నామకరణం చేసిన కెసిఆర్... దానికి ఎనిమిది కొండలుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.
యాదాద్రి అభివృద్ధికి రూ.ఐదు వందల నుంచి రూ.ఆరువందల కోట్ల వరకు అవసరమవుతాయని తెలుస్తోంది. తిరుమలలో ఉన్నట్లు వీఐపీ కాటేజీలు, హిల్ క్లాక్ ఏర్పాటు చేయనున్నారు. తిరుమలలో ప్రస్తుతం రోజుకు డెబ్బై వేల వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు, యాదాద్రిలో ప్రస్తుతం దాదాపు ముప్పై వేల మంది భక్తులు లక్ష్మీనర్సింహ స్వామి వారిని దర్శించుకుంటారు.
పుష్కరాలలో పోటాపోటీ
గోదావరి పుష్కరాలను ఇరు పార్టీలో పోటా పోటీగా నిర్వహించినట్లుగా కనిపించాయనే వాదనలు ఉన్నాయి. చంద్రబాబు, కెసిఆర్లు పుష్కరాలను పోటీగా తీసుకొని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారనే చెప్పవచ్చు. మరోవైపు, జీవ నదుల్లోని నీటి కోసం కూడా ఇరు ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి.
విద్యుత్
తమ తమ రాష్ట్రాలలో 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు. రానున్న రెండు మూడేళ్లలో నిమిషం కరెంట్ పోకుండా విద్యుత్ ఇస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ చెబుతున్నారు. ఏపీలో మాత్రం ఇప్పటికే 24 గంటల విద్యుత్ ఇస్తున్నారు.
తమ వద్ద సర్ప్లస్ విద్యుత్ ఇస్తామని ఏపీ సీఎం గతంలో ప్రతిపాదిస్తే.. తమకు అవసరమైనప్పుడు మెలిక పెట్టారని, ఇప్పుడు అవసరం లేదని తెలంగాణ చెప్పింది. విద్యుత్ విషయంలోను పోటీ పడుతున్నాయి.
లగ్జరీ బస్సులు
ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్లు ఇటీవల లగ్జరీ బస్సులు కొనుగోలు చేశారు. ఇరువురు కూడా ఆధునాతన లగ్జరీ బస్సులు కొనుగోలు చేశారు. వారి బస్సుల ఖరీదు ఒక్కోటి రూ.5 కోట్లు.