తెరాస అవమానం: యాష్కీ, చిట్టా విప్పుతాం: రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరులను అవమానించిందని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆదివారం మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన తెరాస... ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చేలా రాష్ట్రస్థాయి వరకు అన్ని వర్గాలను కలుపుకొనిపోయి ఉద్యమిస్తామని చెప్పారు.
రేవంత్ రెడ్డి నిప్పులు
రాష్ట్రంలో కేసీఆర్ పది నెలల పరిపాలనలో కరవు తాండవిస్తోందని, కరవు గురించి ఆయన పట్టించుకోవడం లేదని, రైతుల ఆత్మహత్యలు ఆయనకు కనబడటం లేదని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి శనివారం ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా వైఫల్యం చెందిందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు టీడీపీ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.

తమ పార్టీ అధినేత చంద్రబాబు ఈనెల 23న మహబూబ్నగర్కు రానున్న సందర్భంలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలను ఎండగడతామన్నారు. తెలంగాణలో సంపూర్ణంగా రాజకీయంగా టీడీపీ ఎదుగుతుందన్నారు. జిల్లాలో 10 నుండి 11 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయినా ప్రభుత్వానికి కనబడడం లేదని, ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.
తెలంగాణ వస్తే కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరని, అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పిన కేసీఆర్ వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాను ఎప్పుడో దత్తత తీసుకుందని, జిల్లా అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications