ఎడ్సెట్లో తొలి 2స్థానాలు: మరొకరితో పరీక్ష రాయించి 'బ్రదర్స్' మస్కా (ఫోటోలు)
హైదరాబాద్: బీఈడీ ప్రవేశ పరీక్ష (ఎడ్ సెట్)లో గుట్టుగా జరిగిన గోల్మాల్ బహిర్గతమైంది. మరొకరితో పరీక్షలు రాయించి తొలి రెండు ర్యాంకులు కైవసం చేసుకున్న అన్నదమ్ముల వ్యవహారాన్ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు బహిర్గతం చేశారు.
తెలంగాణ ఎడ్ సెట్ 15లో ప్రవేశ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వార్తలు వచ్చాయి. దీంతో విచారణ జరిపించారు. కృష్ణకాంత్, లింగస్వామిలు తప్పుడు పద్ధతుల్లో ర్యాంకులు పొందారని విచారణలో తేలింది.
వీరితో పాటు ఇంకెవరి ప్రమేయమైనా ఉందా, ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో విచారించాలని వారం రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కన్వీనర్ ప్రసాద్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకన్న పోలీసులు ఓయు, ప్రవేశ పరీక్షల విభాగంలో కొందరిని ప్రాథమికంగా విచారించి ఆధారాలు సేకరించారు.

నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన మాలిగ కృష్ణకాంత్, మాలిగ లింగస్వామిలు వరుసకు అన్నదమ్ములు. ఇద్దరూ హైదరాబాదులో సాంఘీక శాస్త్రం మెథాడలజీతో ఎడ్ సెట్కు దరఖాస్తు చేశారు. కృష్ణకాంత్కు 111 మార్కులతో తొలి ర్యాంకు, లింగస్వామికి 108 మార్కులతో రెండో ర్యాంకు వచ్చింది.
దరఖాస్తు చేసే సమయం నుంచే పథకం ప్రకారం ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసేందుకు పన్నాగం పన్నినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జరిగిన ఎడ్సెట్ ఫలితాలు జూన్లో విడుదలయ్యాయి. అందులో మొదటి పది ర్యాంకర్ల ఫొటోలతో ఫలితాలు విడుదల చేశారు.
సాంఘిక శాస్త్రంలో 2వ ర్యాంకర్ విషయంలో ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్కు ఫిర్యాదు అందింది. 2వ ర్యాంకర్గా లింగస్వామి పేరు ఉంది. అయితే ఫొటో అతనిది కాదని ఎడ్సెట్ అధికారుల విచారణలో తేలింది.
సాంఘిక శాస్త్రంలో మొదటి ర్యాంకు సాధించిన మాలిగ కృష్ణకాంత్ ఫొటో కూడా దరఖాస్తు ఫారంలో నిర్ణీత ప్రమాణాల ప్రకారం కాకుండా మసకమసకగా ఉన్నది పెట్టడంతో అధికారులు అనుమానించారు. దీంతో సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయం వెలుగు చూడటంతో కృష్ణకాంత్, లింగస్వామిలు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరి కదలికల పైన నిఘా ఉంచిన సిసిఎస్ పోలీసులు మంగళవారం సాయంత్రం లింగస్వామిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మొదటి ర్యాంక్ సాధించిన కృష్ణకాంత్ కోటీ ఉమెన్స్కాలేజీ కేంద్రంలో పరీక్షకు హాజరవగా. లింగస్వామి ఐడియల్ డిగ్రీకాలేజీ ఫర్ ఉమెన్ కేంద్రంలో పరీక్ష రాసినట్లు గుర్తించారు. దీనిపై ప్రభుత్వ ఆదేశం మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీ విచారణ జరిపింది.పూర్తి విచారణ తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఎడ్సెట్ కన్వీనర్ ప్రసాద్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications