షాక్: హైదరాబాద్ లోనూ ‘చిల్ర్డన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’నోట్లు
ఒక వ్యక్తి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న రూ.2000, రూ.500 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చి కటకటాల పాలయ్యాడు.
హైదరాబాద్: చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు ఢిల్లీలోనే కాదు, హైదరాబాద్ లోనూ దర్శనమిచ్చాయి. ఒక వ్యక్తి చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న రూ.2000, రూ.500 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చి కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్ షేక్ అనే స్టేషనరీ షాప్ యజమాని రూ.9.90 లక్షల విలువైన చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను డిపాజిట్ చేసేందుకు మల్కాజిగిరిలోని అలహాబాద్ బ్యాంక్ కు వచ్చాడు.
ఈ విషయాన్ని గమనించిన బ్యాంకు క్యాషియర్ వెంటనే ఆ బ్రాంచి మేనేజర్ కు తెలిపాడు. మేనేజర్ కూడా వెంటనే కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దొంగ నోట్లలో రూ.2000 నోట్లు 400, రూ.500 నోట్లు 300 ఉన్నట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. అసలు నోట్లకు, చిల్ర్డన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటుకు ఏమాత్రం తేడా ఉండదని, వీటికి గుర్తించడం కూడా కష్టమేనని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్డారు.