2700ఏళ్లనాటి ఆచారం: అర్చకుడి భుజ స్కందాలపై దళితుడి ఆలయ ప్రవేశం
Recommended Video
హైదరాబాద్: దేవుని ముందు అందరూ సమానమేనని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు, తెలంగాణ దేవాలయాల పరిరక్షణ కమిటీ ఛైర్మన్ సీఎస్ రంగరాజన్ అన్నారు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలో మునివాహన సేవా కార్యక్రమాన్ని చేపట్టి మనుషులంతా ఒక్కటేనని చాటాలని పిలుపునిచ్చారు.
సోమవారం జియాగూడలోని చరిత్రాత్మక రంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవా మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు.
అర్చకుడి భుజ స్కందాలపై దళితుడు
సోమవారం సాయంత్రం మంగళ వాయిద్యాల మధ్య చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ స్వయంగా ఓ దళిత భక్తుని తన భుజస్కందాలపై ఎత్తుకుని దేవాలయంలోకి మోసుకెళ్లి శ్రీ రంగనాథుని దివ్యదర్శనం చేయించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మనుషులంతా ఒక్కటే
దేవుని ముందు ఎలాంటి భేదాలు, తారతమ్యాల్లేవని, మనుషులంతా సమానమేనని రంగరాజన్ వివరించారు. దళితులను దేవాలయంలోకి అనుమతించరాదంటూ ఎక్కడా పురాణాల్లో లేదని రంగరాజన్ స్పష్టం చేశారు. ఓ యూనివర్శిటీలో జరిగిన చర్చలో దేశంలో జరుగుతున్న దాడుల గురించి దళిత మేధావులు, నాయకులు ప్రస్తావించారని, ఆ సందర్భంలో నేను లోక సారంగ- తిరుప్పాణాళ్వార్ వృత్తాంతాన్ని వినిపించినట్లు తెలిపారు.
మంచి మనస్సుతో.. ధర్మాన్ని రక్షిస్తే..
కానీ, ఎప్పుడో జరిగిందని చెప్పడం కాదు.. ఇప్పుడు మీరు అలా చేయగలరా? అని వాళ్లు ప్రశ్నించటం వల్లే 2700 క్రితం నాటి అరుదైన సన్నివేశానికి మళ్లీ శ్రీకారం చుట్టినట్లు రంగరాజన్ తెలిపారు. శుచి, శుభ్రత, మంచి మనస్సు ఉంటే ప్రతి ఒక్కరు దేవాలయానికి వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చునని తెలిపారు. ధర్మాన్ని రక్షిస్తే, ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందనేది తమ సంకల్పమని రంగరాజన్ పేర్కొన్నారు.
2700ఏళ్లనాటి ఆచారం
అనంతరం చిల్కూరు దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందర్య రంగరాజన్ మాట్లాడుతూ.. దళితులకు ఆలయ ప్రవేశంలో మునివాహన సేవ అనేది కీలక ఘట్టమని తెలిపారు. క్రీ.పూ. 2700 యేళ్ల క్రితం తమిళనాడులోని శ్రీరంగ ఆలయంలో దళితున్ని ఆలయంలోకి రామానుజాచార్యులు వారు స్వయంగా భుజస్కంధాలపై మోసుకెళ్లి స్వామి వారి దర్శనం చేయించారని గుర్తుచేశారు. ఇదే మునివాహన సేవ కార్యక్రమాన్ని జియాగూడలోని శ్రీ రంగనాథ్ స్వామి దేవాలయంలో నిర్వహించామని తెలిపారు.
మహాద్భుత ఘట్టం
దళిత భక్తుడు అదిత్య పరశురాం మాట్లాడుతూ.. కుల, వర్ణ వివక్ష ఉండకూడదని, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలు అందరూ దేవుని వద్ద సమానమేనని అన్నారు. ఈ మునివాహన సేవా మహా అద్భుతమైన ఘట్టమని తెలిపారు. తన గ్రామంలో అంజనేయ స్వామి ఆలయంలోకి తనను అనుమతించకపోవటంతో తాను మహారాష్టక్రు వెళ్లి ఓ గురువు వద్ద వేదాలు, మంత్రాలు నేర్చుకున్నానని ఆదిత్య పరశురాం తెలిపారు. కాగా, మునివాహన సేవ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొన్నారు.