కేసీఆర్ దెబ్బకు బాబు కార్నర్!: చిరు సహా ఎవరికీ తప్పడం లేదా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు విపక్షాల మన్ననలు కూడా పొందుతున్నారా? తద్వారా ఏపీ సీఎం చంద్రబాబును ప్రభుత్వం - పాలన విషయంలో చంద్రబాబును కార్నర్ చేయగలుగుతున్నారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాదులో ఉన్న ఏపీ ప్రముఖులు, సిని ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నారు.
వారి మద్దతు పైన పలువురు ప్రశ్నలు కూడా సంధిస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్ నేపథ్యంలో మద్దతు పలకాల్సిన పరిస్థితి వస్తుందని కొందరు భావిస్తుంటే, ప్రభుత్వం మంచి చేస్తున్నందునే మద్దతు పలుకుతున్నారని ఇంకొందరు చెబుతున్నారు.
కేసీఆర్పై అదొక్కటే అసంతృప్తి, రాజకీయంగా చిరంజీవి ప్రత్యర్థే: పవన్ కళ్యాణ్
కారణం ఏదైనా, తెలంగాణలో కేసీఆర్కు వస్తున్నటువంటి మద్దతు ఏపీలో చంద్రబాబుకు రావడం లేదనే చెప్పవచ్చు. ఏపీలో రాజధాని భూసేకరణ నుంచి మొదలు పథకాల అమలు వరకు కాంగ్రెస్, వైసిపి, ఇతర విపక్షాలు చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. కాపుల రిజర్వేషన్ అంశం పైన విపక్షాలు అన్ని ఒక్కటై చంద్రబాబు పైన విమర్శలు గుప్పించారు. ఏపీలో ఏ అంశాన్ని విపక్షాలు వదులుకోవడం లేదు.
తెలంగాణ విషయానికి వచ్చేసరికి కొంత ట్విస్ట్ కనిపిస్తోంది. చాలామంది ప్రముఖులు, రాజకీయాల్లో ఉన్న సినీనటులు హైదరాబాదులో నివసిస్తున్నారు. వారు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నారు.
వారి మద్దతు పైన ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వాలకు అండగా ఉండటం గమనార్హం. సినిమా పరిశ్రమ నుంచి మొదలు పెడితే హరిత హారం వరకు... సినీ తారల మద్దతును కేసీఆర్ ప్రభుత్వం పొందుతోంది.
గతంలో చిరంజీవి ఓసారి మాట్లాడుతూ... కేసీఆర్ సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారని కితాబిచ్చారు. ఇప్పుడు హరిత హారం కార్యక్రమంలోను పాల్గొన్నారు. హరిత హారం కార్యక్రమాన్ని పక్కన పెడితే.. గతంలో కేసీఆర్ను పొగడటం ద్వారా సొంత పార్టీ తెలంగాణ నేతలనే ఆయన ఇరుకున పడేశారనే వాదనలు వినిపించాయి.
దాసరి-చిరంజీవి ఆత్మీయ ఆలింగనం, కేసీఆర్పై 'చిరు' ప్రశంస
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కేసీఆర్ పాలన పైన గతంలో ఓసారి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం పైన మాత్రమే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నాగార్జున కూడా తెరాసకు దగ్గరయ్యారనే వాదనలు ఉన్నాయి.
సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని నటుడు, మా అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ కూడా చెబుతున్నారు. సమైక్య ఏపీలో విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి రాజగోపాల్ గతంలో గోదావరి పుష్కరాలకు వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి కితాబిచ్చారు.
తాజాగా, మాజీ మంత్రి, టిడిపి రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోతే ఏమవుతుందోనని భయపడి తాము సమైక్యాంధ్ర ఉద్యమం చేశామని, ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదని, ఇరు రాష్ట్రాలు విడిపోయినా, ప్రజలు ఒకటిగానే ఉన్నారని చెప్పారు.