అగస్టా స్కాం: హైదరాబాద్ సహా పలుచోట్ల సోదాలు, రూ.86 కోట్ల షేర్లు సీజ్
హైదరాబాద్/న్యూఢిల్లీ: సంచలనం రేపిన అగస్టా కుంభకోణంలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోమవారం నాడు దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా పది చోట్ల సోదాలు నిర్వహించి, రూ.86 కోట్ల విలువల గల షేర్లను ప్రీజ్ చేశారు.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలలో సోదాలు నిర్వహించింది. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. అయితే ఎవరి ఆస్తులపై ఈడీ దాడులు నిర్వహించిందన్న దానిపై అధికారులు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
అయితే వారికి సంబంధించి దుబాయ్, మారిషస్, సింగపూర్ల్లో ఉన్న షేర్లను స్తంభింపజేసినట్లు చెప్పారు.
గత బుధవారం ఈడీ బ్రిటన్ దేశస్థుడైన అయిన క్రిస్టియన్ మైఖేల్ జేమ్స్ సహా మరో ఇద్దరు మధ్యవర్తులపై ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అగస్టా కుంభకోణంతో వారికి సంబంధాలు ఉన్నాయని ఆ ఛార్జిషీట్లో పేర్కొంది.

ఈ కుంభకోణంలో ముడుపులను భారతీయ అధికారులకు అందించడంలో జేమ్స్ పాత్ర ఉందని తెలుస్తోంది. అయితే తాను ఇప్పటి వరకు ఎప్పుడూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలవలేదని, భారతీయ విచారణ సంస్థలు తనను విచారించుకోవచ్చని జేమ్స్ వెల్లడించాడు.
ఈ కేసులో ఈడీ 21 మంది పైన పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్) కింద కేసు నమోదు చేసింది. అందులో త్యాగి తదితరులు ఉన్నారు. ఢిల్లీ వ్యాపారవేత్త గౌతంను అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం అతను బెయిల్ పైన బయట ఉన్నాడు.












Click it and Unblock the Notifications