హైదరాబాద్ కు వ్యాపించిన నిరసన సెగ: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ..!
Hyderabad: హైదరాబాద్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం నిరసన సెగలు కేవలం ఈశాన్యం, కొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. హైదరాబాద్ లోనూ కనిపించాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడాన్ని నిరసిస్తూ ముస్లిం విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. దక్షిణాదిన పౌరసత్వ సవరణ చట్టం వేడిని చవి చూస్తోన్న మూడో రాష్ట్రంగా చేరింది తెలంగాణ.

మెహదీపట్నంలో భారీ ప్రదర్శన..
ముస్లింల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉండే మెహదీపట్నంలో భారీ ర్యాలీని నిర్వహించారు స్థానికులు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలు ముగిసిన అనంతరం స్థానిక ముస్లింలు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనను చేపట్టారు. మెహదీపట్నం రైతుబజార్ వద్ద నుంచి టోలీచౌకీ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. రేతిబౌలి మీదుగా సాగిన ఈ ర్యాలీలో పాల్గొన్న స్థానికులు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నో సీఏబీ.. నో ఎన్ఆర్సీ..
దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలనుకోవడం మూర్ఖత్వమని వారు విమర్శించారు. భారత్ లోనే తాము జన్మించామని, ఈ గడ్డ మీదే కన్నుమూస్తామని నినదించారు. ముస్లింలందరినీ భారత్ నుంచి తరిమేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు- నో సీఏబీ, నో ఎన్ఆర్సీ అంటూ ముద్రించిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

దక్షిణాదిన నిరసనల వేడి..
ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాల తరహాలోనే దక్షిణాదిన కూడా పౌరసత్వ సవరణ చట్టంపై ముస్లింలు నిరసన ప్రదర్శనలను చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తమిళనాడు, కేరళల్లో ఈ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు గళమెత్తిన విషయం తెలిసిందే. వారంతా మూకుమ్మడిగా ప్రదర్శనలు, ర్యాలీలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అస్సాం, త్రిపుర, మేఘాలయాల్లో నిరసన ప్రదర్శనలు భారీ ఎత్తున కొనసాగుతున్నాయి. ఇక దక్షిణాదిన కూడా దీనికి సంబంధించిన వేడి రాజుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.












Click it and Unblock the Notifications