దళిత హక్కుల నేత బొజ్జా తారకం ఇక లేరు
హైదరాబాద్: దళిత హక్కుల నేత బొజ్జా తారకం కన్నుమూశారు. పౌర హక్కుల ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. హేతువాది, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు బొజ్జా తారకం (78) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న బొజ్జా తారకం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆయన కుమారుడే. కుమార్తె మహిత వైద్యురాలిగా ఉన్నారు. బొజ్జా తారకం మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బొజ్జా తారకం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ తెలంగాణ ఉద్యమంలోని ధర్మాన్ని గుర్తించారని, తనకు, ఉద్యమానికి మద్దతుగా నిలిచారని సీఎం కేసీఆర్ అన్నారు
తూర్పుగోదావరి జిల్లా కాంట్రేని కోన మండలం కందికుప్ప గ్రామంలో అప్పలస్వామి, మావూళ్లమ్మ దంపతులకు 1939 జూన్ 27న తారకం జన్మించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన బొజ్జా తారకం 1966లో కాకినాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రముఖ కవి బోయి భీమన్న కూతురు విజయభారతిని 1968లో వివాహం చేసుకున్నారు.
1975లో అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు నిజామాబాద్లో ఆయనను పోలీసులు అరెస్టుచేశారు. తదుపరి 1979 నుంచి హైదరాబాద్లో ఉంటూ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ కొనసాగించారు. ప్రజా ఉద్యమాలకు సంబంధించిన పలు కేసులను ఆయన హైకోర్టులో చేపట్టారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కారంచేడు మారణహోమం తర్వాత న్యాయవాద వృత్తిని వదిలేసి దళిత నేత కత్తి పద్మారావుతో కలిసి కారంచేడు శిబిరంలో దీక్ష చేశారు.
పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లపై కేసులు నమోదు చేసి విచారణ జరుపాలంటూ సుప్రీంకోర్టులో పోరాడి.. విజయం సాధించారు. దళిత, పౌర హక్కుల ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన బొజ్జా తారకం రాజకీయ నాయకుడిగానే కాకుండా రచయితగా కూడా ప్రఖ్యాతి గడించారు. పోలీసులు అరెస్టు చేస్తే?, కులం-వర్గం, నది పుట్టిన గొంతుక, నేల నాగలి-మూడెద్దులు, దళితులు-రాజ్యం వంటి పుస్తకాలు రచించారు.
బొజ్జా తారకం మృతి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బొజ్జాతారకం కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.విరసం నేత వరవరరావు, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ సభ్యుడు రవీంద్రనాథ్ తదితరులు బొజ్జాతారకం మృతికి సంతాపం ప్రకటించారు.