దాసరి కుమారుల మధ్య భగ్గుమన్న ఆస్తి గొడవలు... ప్రభు ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా..
దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు ఇంట్లో ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దాసరి కుమారులు ప్రభు,అరుణ్ల మధ్య తండ్రి ఆస్తులపై పేచీ నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల దాసరి అరుణ్ రాత్రి వేళ తన ఇంటి గోడ దూకి వచ్చి.. మద్యం మత్తులో తమపై దాడికి పాల్పడ్డాడని దాసరి ప్రభు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాసరి కుటుంబం ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్లో పెద్ద దిక్కుగా ఎన్నో వివాదాల్ని ఒంటి చేత్తో పరిష్కరించిన దాసరి కుటుంబం ఇలా రోడ్డున పడి గొడవలు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది.

రాత్రి ప్రభు ఇంట్లోకి చొరబడ్డ అరుణ్...
దాసరి ప్రభు చెబుతున్న వివరాల ప్రకారం... ఈనెల 24న రాత్రి 10 గంటల సమయంలో దాసరి అరుణ్ కుమార్,అతని కారు డ్రైవర్ ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. మద్యం మత్తులో అరుణ్ ఆయన్ను తీవ్ర దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. ఇంట్లో ఉన్న దాసరి నారాయణ రావు బీరువాను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్నందుకు తనతో పాటు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డాడు. తాను కోర్టులో కేసు గెలిచానని,ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరించాడు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ప్రభు ఈ వివరాలను వెల్లడించారు.

ఆ ఇల్లు మనవరాలిపై..
అరుణ్ తన ఇంట్లోకి చొరబడ్డ సమయంలో గేటు బయట మరికొందరు ఉన్నారని ఫిర్యాదులో ప్రభు పేర్కొన్నారు. ఆస్తి కోసమే తన తమ్ముడు వేధిస్తున్నాడని,చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. సోదరుడు అరుణ్ వెనుక కొందరు పెద్ద మనుషులు ఉన్నారని... వారే అతన్ని ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. దాసరి నారాయణరావు తన ఇంటిని మనవరాలి పేరుపై రాశారని అన్నారు. వీలునామా ప్రకారం ఆ ఇల్లు తన కూతురుకే చెందుతుందన్నారు.

ఆస్తి వివాదాలు...
తన తండ్రికి ఆప్తులు అయిన మోహన్బాబు, మురళీమోహన్, సి.కల్యాణ్ వంటి సినీ పెద్దలు ఈ విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలన్నారు ప్రభు. అలాగే ఆస్తి కోసం తమపై దౌర్జన్యానికి పాల్పడిన అరుణ్పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దాసరి నారాయణరావుకు సంబంధించి అనేక ఆస్తుల్లో లెక్క పత్రాలు సరిగా లేవన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.44 సినీ మీడియా కాంప్లెక్సును బలవంతంగా అమ్మేశారని ఆరోపించారు. అలాగే దాసరి ఫామ్ హౌజ్ అమ్మకానికి సంబంధించిన లెక్కలు కూడా తేలలేదన్నారు. చందానగర్లో 33 అపార్ట్మెంట్లపై కూడా వివాదం నడుస్తోందని.. ఆ లెక్క ఎటూ తేలలేని అన్నారు.
Recommended Video

పెద్దలు జోక్యం చేసుకోవాలని...
తాను బతికున్నప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సమస్యలను పరిష్కరించిన దాసరి కుటుంబంలో ఇలాంటి వివాదాలు చోటు చేసుకోవడంపై ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబంతో సాన్నిహిత్యం కలిగిన పెద్దలు జోక్యం చేసుకుని... ప్రభు,అరుణ్లను కూర్చోబెట్టి సామరస్యంగా ఆస్తి పంపకాలు జరిపించాలని కోరుతున్నారు. వివాదం మరింత ముదిరితే దాసరి ప్రతిష్టకు భంగం కలుగుతుందని వాపోతున్నారు.












Click it and Unblock the Notifications