తెలంగాణలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రద్దు: రాయాలనుకునేవారికి అప్పుడే అవకాశం
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలను కూడా రద్దు చేసింది.
కాగా, ఇంటర్మీడియట్ పరీక్షలపై మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో చర్చించారు. ఆ తర్వాత దీనిపై ప్రకటన చేయలేదు. అయితే, అప్పటికే తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దయ్యాయంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి అధికారికంగా ప్రకటించారు.
ఇంటర్ మొదటి సంవత్సరం మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి సబిత తెలిపారు. మార్కుల కేటాయింపుపై త్వరలో కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రూపొందిస్తామన్నారు. కమిటీ నిర్ణయం ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు.
ఇక పరీక్షలు రాయాలనుకునేవారు పరిస్థితులు చక్కపడ్డాక రాయొచ్చని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయడంపట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,29,896 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,813 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,96,813కు చేరింది.
కోవిడ్ బారినపడి మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్తో మరణించినవారి సంఖ్య 3,426కి చేరుకుంది. మరోవైపు 1,801మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసులు 5,69,086కు చేరాయి. ప్రస్తుతం 24,301 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో ఖమ్మంలో 180 పాజిటివ్ కేసులు, జీహెచ్ఎంసీ పరిధిలో 179 కొత్త కేసులు నమోదయ్యాయి. లాక్డౌన్ మంచి ఫలితాలనిస్తున్న క్రమంలో మరోసారి పొడిగించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ మినహాయింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు.