సీఎల్పీ నేతగా ఆ ఇద్దరిలో ఒకరికి అవకాశం..! మరికొద్ది సేపట్లో ప్రకటన..!!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా ఆచితూచి చేస్తుంటుంది. అది కొన్ని సందర్బాల్లో అనూకూ ఫలితాలను ఇస్తే మరి కొన్ని సందర్బాల్లో ప్రతికూల ఫలితాలను అందిస్తుంది. ఐనప్పటికి కాంగ్రెస్ పార్టీ మాత్రం అదే పద్దతిని అనుసరిస్తోంది. తాజాగా తెలంగాణలో సీఎల్పీ నేత ఎన్నిక విషయంలో కూడా తర్జన భర్జన పడుతోంది. ఎవరిని శాసన సభలో లిజిస్లేచర్ నేతగా ఎన్నుకోవాలి అనే అంశంపై లోతైన కసరత్తు చేస్తోంది. శాసనసభలో ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపడంతో పాటు, ప్రజా సమస్యలను వినిపించే సత్తా ఉన్న నేతకు అవకాశం ఇవ్వాలని టీపిసిసి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నిన్న పొద్దుపోయేంత వరకు ఇదే విషయంలో ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపిన టీపిసిసి నేడు శాసన సభలో తమ ప్రతిపక్ష నేతను ఎన్నుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా ఓకే అనుకున్న తరువాత రెండు మూడు పేర్లను కాంగ్రెస్ అదిష్టానానికి పంపించినట్టు తెలుస్తోంది. అదిష్టానం సూచించిన అభ్యర్థిని సీఎల్పీ నేతగా నేడు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక సీఎల్పీ నేతగా మల్లు భట్టి విక్రమార్క లేదా దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి గోల్కొండ హోటల్ లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కోర్ కమిటీకి సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా,ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, సలీమ్ అహ్మద్, శ్రీనివాసన్, పీసీసీ చీఫ్ ఉత్తమ్, కే.జానారెడ్డి, షబ్బీర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్లు కుసుమ కుమార్, పొన్నం ప్రభాకర్, హాజరయ్యారు.
సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియను కేసి వేణుగోపాల్ కు కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించింది. సీఎల్పీ నేత ఎంపికపై పలువురి అభిప్రాయలను సేకరించారు. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. ఈ భేటీలో మరోసారి అభిప్రాయం తీసుకుని సీఎల్పీ నేతను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.