మనసులో మాట: సీఎం పదవికి నా కంటే అర్హులున్నారా: జానారెడ్డి
హైదరాబాద్: ఎప్పుడూ నిండుకుండలా ఉండే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నేత జానారెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. తెలంగాణ సీఎం పదవికి కాంగ్రెస్ పార్టీలో తన కంటే ఎవరికి అర్హతలున్నాయని ఆయన ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ పదవికి కూడ చేపట్టేందుకు తాను సిద్దమనే సంకేతాలను కూడ ఇచ్చారు.
ఎన్నికలు ఏడాది సమయం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు అన్ని రకాల శక్తులను కూడదీసుకొంటుంది. ఇతర పార్టీల నుండి వలసలను ప్రోత్సహిస్తోంది.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టారు. ముఖ్యమంత్రి పదవి మినహ ఇతర అన్ని రకాల పదవులను జానారెడ్డి నిర్వహించిన అనుభవం ఉంది.

సీఎం పదవికి అర్హులున్నారా
తెలంగాణ సీఎం పదవికి తన కంటే కాంగ్రెస్ పార్టీలో అర్హులున్నారా అని సీఎల్పీ నేత జా,నారరెడ్డి ప్రశ్నించారు. ఈ విషయమై ఇంతకాలం పాటు గుంభనంగా ఉన్న జానారెడ్డి తన మనసులోని మాటను ఎట్టకేలకు బయటపెట్టారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం అభ్యర్ధిగా తాను రంగంలో ఉన్నట్టుగా జానారెడ్డి తన మనసులో మాట బయటపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో తన కంటే అర్హులైన వారున్నారా అని ఆయన ప్రశ్నించారు.

పీసీసీ చీఫ్ పదవికి కూడ రెడీ
తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవికి కూడ తాను సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి తేల్చి చెప్పారు. గతంలో కూడ తనకు ఈ పదవి దక్కని సమయంలో పార్టీ ప్రయోజనాల రీత్యా తాను నోరు మెదపలేదని ఆయన చెప్పారు. ఈ దఫా పీసీసీ చీఫ్ పదవి ఇస్తానంటే తాను వద్దననే విషయాన్ని ప్రస్తావించారు.

6 మాసాల ముందే తెలంగాణ ఇస్తే లాభం
తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఆరు మాసాల ముందే ఇస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం ఎక్కువగా ఉండేదని సీఎల్పీ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. కానీ ఆనాడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని జానారెడ్డి గుర్తు చేశారు.25 మంది ఎంపీలు పక్కకు వెళ్తే అప్పటి యూపీఏ ప్రభుత్వం కుప్పకూలిపోయేదన్నారు.కానీ, ఇచ్చిన మాట ప్రకారంగానే తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేలా సోనియాగాంధీని ఒప్పించినట్టు ఆయన గుర్తు చేశారు.

రాజకీయంగా మార్గదర్శనం చేశా
తాను ఎందరికో రాజకీయంగా మార్గదర్శనం చేశానని సిఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి లాంటి వారికి తాను రాజకీయంగా మార్గదర్శనం చేసిన విషయాన్ని జానారెడ్డి ప్రస్తావించారు. ఎప్పుడు గుంభనంగా ఉండే జానారెడ్డి తన మనసులోని మాటను బయటపెట్టడం రాజకీయంగా సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications