మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన మునుగోడుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ఇప్పటికే షెడ్యూల్ విడదుల కావటంతో పాటుగా కొద్ది సేపటి క్రితం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో..ఉప ఎన్నికల కోసం పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు పార్టీ అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నట్లుగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి.. బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచారు.
తొలి నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి టికెట్ పైన భారీగా ఆశలు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ప్రభాకర్ రెడ్డి పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసారు. ఆయన 2009లో మహేశ్వరం నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి 38,055 ఓట్ల మెజారిటీతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సమయం నుంచి ఆయన పేరు అధికారికంగా ప్రకటించకపోయినా, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి మునుగోడు పైన నిర్వహించిన సమీక్షల్లోనూ ప్రభాకర రెడ్డి హాజరు కావటం ద్వారా ఆయనే పార్టీ అభ్యర్ధి అవుతారని అందరూ అంచనా వేసారు.

ఒక దశలో పార్టీ నుంచి బీసీ వర్గానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. 2018 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడినా.. ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ - బీజేపీ రెండు పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వటంతో.. కొత్త ప్రయోగాలకు తావు లేకుండా ప్రభాకర రెడ్డికే అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రభాకర్ రెడ్డి - టీఆర్ఎస్ గెలుపు అవకాశాల పైన విభిన్న మార్గాల్లో సర్వేలు చేయించినట్లుగా తెలుస్తోంది. వాటి నుంచి ఫీడ్ బ్యాక్ ఆధారంగానే చివరికి ప్రభాకర రెడ్డి పేరు ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఈ నెల 14 లేదా 14వ తేదీన ప్రభాకర రెడ్డి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications