కేసీఆర్ ఆయన్ను సంభ్రమాశ్చార్యాల్లో ముంచెత్తాడు: బాల్య స్నేహితుడికి ఊహించని పదవి
మెదక్: వరాలు కురిపించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా!.. ఎవరు ఏది కోరినా అంతకుమించిందే ఇస్తారు తప్ప తక్కువ చేయరు. తాజాగా తన బాల్యమిత్రుని విషయంలోనూ ఇదే చేశారు కేసీఆర్. కలలో కూడా ఊహించని పదవిని కట్టబెట్టి ఆ మిత్రున్ని సంభ్రమాశ్చార్యాల్లో ముంచెత్తారు.
ఇంతకీ ఎవరా మిత్రుడు అంటే.. చిన్నప్పుడు కేసీఆర్ తో కలిసి చదువుకున్న బొమ్మెర వెంకటేశం. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన బొమ్మెర వెంకటేశం, కేసీఆర్ లు బాల్య స్నేహితులు. వీరిద్దరు ఐదో తరగతి దాకా దుబ్బాకలో కలిసి చదువుకున్నారు.
బొమ్మెర చిరువ్యాపారిగా స్థిరపడ్డాడు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత బొమ్మెరతో సాన్నిహిత్యాన్ని వీడలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తనను నేరుగా కలిసే స్వేచ్చను కల్పించారు కేసీఆర్. ఎప్పుడైనా బొమ్మెర ఆయన వద్దకు వస్తే.. 'నీకేం పదవి కావాలో చెప్పు' అంటూ బొమ్మెరను అడిగేవారు. అయినా సరే, బొమ్మెర ఎప్పుడూ ఏది అడలేదు.
అయితే ఏదైనా దేవాయలంలో డైరెక్టర్ పదవి ఇప్పిస్తే భగవంతుడి సేవలో తరిస్తానని ఇటీవల బొమ్మెర కేసీఆర్ తో చెప్పినట్టు సమాచారం. దీంతో బొమ్మెరను ఏకంగా ఓ ఆలయానికి ఛైర్మన్ ను చేసేశారు కేసీఆర్. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి ఆయన్ను ఛైర్మన్ గా నియమించారు.
తనను డైరెక్టర్ గా నామినేట్ చేశారని మాత్రమే తెలిసిన బొమ్మెర.. బుధవారం ఉదయం పత్రికలో వచ్చిన వార్తను చూసి ఆశ్చర్యపోయారు. తనను ఛైర్మన్ గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఆలయ ఛైర్మన్ పదవికి బొమ్మెర ఎన్నికయ్యేలా చూడాలని సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ రావుకు చెప్పడంతో.. మిగతా వ్యవహారమంతా ఆయనే డీల్ చేశారు. మొత్తం మీద కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ఛైర్మన్ గా బొమ్మెర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.