ముందస్తు!: కేసీఆర్ రేపటి సమావేశంపై ఉత్కంఠ, మంత్రులందరూ హాజరుకావాల్సిందే!
హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు(బుధవారం) కీలక సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ వేదికగా మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ మేరకు మంత్రులందరూ తప్పనిసరిగా అందుబాటులో ఉండాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది.
Recommended Video
ఈ సమావేశం పూర్తిగా రాజకీయపరమైన అంశాలే ప్రధాన ఎజెండాగా జరగనున్నట్లు తెలుస్తోంది. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. డిసెంబర్ లో శాసనసభకు ఎన్నికలు జరగుతాయని... సెప్టెంబర్ నెలాఖర్లో శాసనసభను రద్దు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి మంత్రివర్గ సహచరులకు కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ప్రగతి నివేదన సభ నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక, కాంగ్రెస్ హామీలు సహా ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం లాంటి అంశాలపై సీఎం దిశానిర్ధేశం చేయనున్నారు.
వచ్చే ఎన్నికల కోసం ముందుగానే సిద్ధమవుతున్నట్లు ఇటీవల పార్టీ కార్యవర్గ సమావేశం సందర్భంగా ప్రకటించారు కేసీఆర్. అంతేగాక, సెప్టెంబర్లోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని చెప్పారు. రేపటి సమావేశం తర్వాత కేసీఆర్ ఏదైనా కీలక ప్రకటన చేస్తారా? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.