కేంద్రం పై కేసీఆర్ సంచలనం - రాష్ట్రంలో సర్వే ఫలితాలపైనా : పోరాట కార్యాచరణ ఫిక్స్..!!
ఊహించినట్లుగానే తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వంపైన పోరాటానికి సిద్దమయ్యారు. గతం కంటే తీవ్రంగా ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. దీనికి సంబంధించి పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసారు. పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీలోని అన్ని విభాగ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. అందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తాము అడుగుతున్న విధంగా వరి మాత్రమే కాకుండా.. కేంద్రమే అన్ని పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. రైతుల సమస్యలపై తెలంగాణ ఉద్యమ కంటే ధాటిగా పోరాడుదామని కేసీఆర్ పిలుపునిచ్చారు.
జాతీయ స్థాయిలో పోరాటం
రైతుల ఆందోళనలు పక్కదోవ పట్టించేందుకే కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల చేసారని వ్యాఖ్యానించారు. దేశానికి కావాల్సింది ఇరిగేషన్ ఫైల్స్.. వ్యవసాయం ఫైల్స్ అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ నెల 24, 25 తేదీల్లో కేంద్ర తీరుకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రతీ పంటకు కేంద్ర గిట్టుబాటు ధర కల్పించాలని.. అదే సమయంలో ధరల పైన చట్టబద్దత ఉండాలని కేసీఆర్ డిమాండ్ చేసారు. రాష్ట్ర విభజన చట్టం అమలు చేయాలని..వీటిని పట్టించుకోవటం లేదని కేసీఆర్ సమావేశంలో చెప్పుకొచ్చారు.
మోదీ ప్రభుత్వం అన్నింటా విఫలం
ఈ నెల 28న 28న యాదాద్రికి అందరూ రావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని..పాలనలో మోదీ ప్రభుత్వం అన్నింటా విఫలమైందని కేసీఆర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలనే కాకుండా.. రైతులందరినీ కలుపుకొని ఉద్యమం చేయాలని కేసీఆర్ నిర్దేశించారు. వ్యవసాయ ఉత్పత్తులకు రాజ్యంగ రక్షణ అవసరమని స్పష్టం చేసారు. తెలంగాణ పై పక్షపాత ధోరణి కేంద్రం అవలంభిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఇక, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు..ప్రజాభిప్రాయ సేకరణ చేయిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
సర్వేలో ఏం తేలిందంటే..
ఒక ప్రముఖ సంస్థతో సర్వే చేయిస్తున్నామని..ఇప్పటి వరకు 30 నియోజవకర్గాల్లో 29 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఈ నెలాఖరు నాటికి సర్వే పూర్తి అవుతుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. పార్టీ నేతలతో ఇంకా సమావేశం కొనసాగుతోంది. ఆ తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అందులో తన కార్యాచరణ.. ఢిల్లీ మాత్ర..పోరాట షెడ్యూల్ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు.