నో ఛేంజ్: 2నే ప్రగతి నివేదిక: ముందస్తుకు మంత్రుల బ్రేక్, సీఎం ఓకే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఇప్పట్నుంచే సిద్ధం చేస్తున్నారు. బుధవారం రాత్రి మంత్రులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. ప్రగతిభవన్ లో సాయంత్రం నాలుగు గంటల నుంచి కొనసాగుతున్న సమావేశంలో పార్టీ, పాలనపరమైన అంశాలపై చర్చించారు.
ఎన్నికల సన్నద్ధత, ప్రగతి నివేదన సభ, సర్వేల్లో మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యక్తమైన అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మరోవైపు ఆగస్టు 24న మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, పార్లమెంటరీ పార్టీ, శాసనసభా పక్షం సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎన్నికల సన్నాహాలు, పార్టీ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కీలక చర్చలు జరపనున్నారు. ఆగస్టు 17నే సంయుక్త సమావేశం జరపాలని గతంలో నిర్ణయించినప్పటికీ.. వర్షాలు, వరదల కారణంగా వాయిదా వేశారు.
మరోవైపు ప్రగతి నివేదన సభను ముందుగా ప్రకటించినట్లుగా సెప్టెంబరు 2నే నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్న మండలం పరిధిలోని కొంగర కలాన్ వద్ద ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహిచేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది. గురువారం నుంచే సభ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులను కేసీఆర్ ఆదేశించారు. సభ కోసం సుమారు 1600 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశామని, అందులో సభావేదిక, బారీకేడ్లు, పార్కింగ్ కేంద్రాలు తదితర ఏర్పాట్లు చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
ముందస్తు ఎన్నికలకు మంత్రుల బ్రేక్
కాగా, తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా? వద్దా? అన్న దానిపై తమ మంత్రుల అభిప్రాయాన్ని కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. ముందస్తుకు వెళ్లకపోవడమే మంచిదని మెజారిటీ సంఖ్యలో మంత్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారట. ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళతాయని మంత్రులు అభిప్రాయపడ్డారని.. దీంతో మంత్రుల అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఏకీభవించినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదని మంత్రులతో కేసీఆర్ అన్నట్టు తెలిసింది. కేవలం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాత్రమే చెప్పినట్లు గుర్తు చేశారని సమాచారం.