సీఎం కేసీఆర్తో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పలు కీలక అంశాలపై చర్చ జరుపుతున్నారు. డిసెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంపై కేంద్రం ఆర్థిక ఆంక్షలు, కేంద్ర ఆర్థిక విధానాలపై ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. డిసెంబర్ నెలలో వారం రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన క్రమంలో.. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డిని ఆదేశించారు.

తెలంగాణపై కేంద్రం విధిస్తున్న అనవసర ఆంక్షలతో ఈ ఆర్థిక ఏడాదిలో రాష్ట్రానికి సమకూరాల్సిన ఆదాయంలో 40వేల కోట్లు తగ్గుతాయని టీఆర్ఎస్ సర్కారు చెబుతోంది. ఈ చర్యలతో తెలంగాణ అభివృద్ధి ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తోందని ఆరోపణలు చేస్తోంది.
రాష్ట్ర ప్రజలకు వీటి గురించి తెలిపేందుకు వీలుగా.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సెప్టెంబర్ నెలలో సమావేశమైన ఉభయసభలు ఇప్పటి వరకు ప్రోరోగ్ కాలేదు.. దీంతో గత సమావేశాలకు కొనసాగింపుగానే తాజా సమావేశాలు జరుగనున్నాయి.
స్పీకర్, మండలి ఛైర్మన్ల ఆదేశాలతో.. సమావేశాల నిర్వహణఫై అసెంబ్లీ సచివాలయం సభ్యులకు సమాచారం అందించనుంది.
మరోవైపు, తెలంగాణ మంత్రులు, బంధువుల ఇళ్లపై ఈడీ, ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇది ఇలావుండగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక బీజేపీ నేతకు ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ యుద్ధ వాతావరణమే నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య కూడా విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనుండటంతో ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications