కేంద్రంపై కేసీఆర్ ద్విముఖపోరు; బీజేపీపై ఒత్తిడి పెంచేలా ఢిల్లీ నుండి గల్లీదాకా ఆందోళనలు
కేంద్రంలోని బిజెపి సర్కార్ పై తెలంగాణ సర్కార్ సమరభేరి మోగించింది. బిజెపి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో అటు ఢిల్లీలోనూ, తెలంగాణ రాష్ట్రంలోనూ ఆందోళనలకు శ్రీకారం చుట్టిన కెసిఆర్ సర్కార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసనలు తెలియ చేయాలని నిర్ణయించింది.

కేంద్రంపై టీఆర్ఎస్ పోరు.. ధాన్యం కొనుగోళ్ళపైనే కాదు, గ్యాస్, పెట్రోల్ ధరలపైన కూడా
ఒకపక్క ధాన్యం కొనుగోలు, బియ్యం సేకరణపై ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం సానుకూలంగా స్పందించకుంటే పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు నిరసన గళం వినిపించాలని, అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి సర్కార్ పై ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని కెసిఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై బీజేపీపై పోరు కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపద్యంలో అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా టీఆర్ఎస్ ధర్నా
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను డబల్ చేసి ప్రజలపై భారం మోపారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల కోసం ప్రధాని మోడీ ఒక సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు . దేశం నుంచి తరిమికొట్టే వరకు బిజెపికి బుద్ధి రాదని మండిపడ్డారు.

బీజేపీని, మోడీని ఇంటికి పంపే రోజులు దగ్గరలోనే: మంత్రి తలసాని
ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోడీని, బిజెపి ని ఇంటికి పంపించే రోజులు దగ్గరపడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని మండిపడుతున్నారు. ఎన్నికలు అయిన వెంటనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతాయని సీఎం కేసీఆర్ చెప్పారని అదే విధంగా ధరలు పెరిగాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ధరలు పెంచుతుందని మండిపడ్డారు. ఇప్పటికే కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .

ధాన్యం కొనుగోళ్ళ కోసం కేంద్ర మంత్రుల వద్దకు టీఆర్ఎస్ మంత్రులు
ఇదిలా ఉంటే ఢిల్లీలో ఉన్న తెలంగాణ మంత్రులు ఇవాళ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీ కేకే పీయూష్ గోయల్ ను కలిసి అపాయింట్మెంట్ కోరగా ఆయన ఈరోజు మధ్యాహ్నం 2:30 కు అపాయింట్మెంట్ ఇచ్చారు. పంజాబ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని వన్ నేషన్ వన్ ప్రొక్యూర్ మెంట్ నినాదంతో కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేయనున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలతో, మరోవైపు ఢిల్లీ కేంద్రంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో టిఆర్ఎస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో బీజేపీతో తలపడుతుంది.












Click it and Unblock the Notifications