ఇంటింటికీ మంచినీళ్లు.. సీరియస్ గా తీసుకున్న కేసీఆర్.. డెడ్ లైన్ ఎప్పుడో తెలుసా?
హైదరాబాద్ : ఇంటింటికీ మంచినీరు అందించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథపై విపక్ష నేతలు ఓ రేంజ్ లో ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల వేళ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మాటల తూటాలు సంధించారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన కేసీఆర్.. అది పూర్తికాకుండానే ఎన్నికలకు సిద్ధమయ్యారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ మిషన్ భగీరథపై సీరియస్ గా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
మిషన్ భగీరథ అమలుపై సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కేసీఆర్. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పనుల పురోగతి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. 23,968 ఆవాస ప్రాంతాలకు గాను 23,947 ఏరియాల్లో నీరు సరఫరా అవుతోందని అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 95 శాతం నివాసాలకు నల్లాలు బిగించినట్లు వివరించారు. దీనిపై స్పందించిన కేసీఆర్.. మార్చి 31 కల్లా మిషన్ భగీరథ పథకం ప్రతి ఇంటికి చేరాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏ ఒక్కరూ కూడ మంచి నీళ్ల కోసం రోడ్లపై కనపడకుండా భగీరథ పనులు వేగవంతం చేయాలని సూచించారు.
మిషన్ భగీరథ అమలుకు ఎంత ఖర్చైనా సరే వెనుకడుగు వేసేది లేదని మరోసారి స్పష్టం చేశారు కేసీఆర్. గిరిజన తండాలు దళిత వాడలు, మారుమూల ప్రాంతాలకు మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లు ఇవ్వడంతోనే బాధ్యత తీరిపోదని.. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిరంతరాయంగా మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.