'మార్చిలో తెలంగాణకు ప్రధాని': సచివాలయంలో కేసీఆర్ మనవడు హిమాన్షు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు శుక్రవారం తెలంగాణ సచివాలయంలో సందడి చేశారు. సచివాలయంలోని సి బ్లాక్ను చూసేందుకు తన స్నేహితులను వెంటపెట్టుకుని మధ్యాహ్నాం సమయంలో వచ్చారు.
ఈ సందర్భంగా హిమాన్షు సచివాలయంలోని సీ బ్లాక్లో తన స్నేహితులతో కలియదిరుగుతూ కాసేపు హల్చల్ చేశారు. దీంతో సచివాలయ అధికారులు కాస్తంత ఇబ్బంది పడ్డారు. సచివాలయాన్ని కలియదిరిగిన తర్వాత తిరిగి మళ్లీ స్నేహితులతో అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన అయత చండీయాగంలో తాతతో పాటు హిమాన్షు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే.
మార్చి మొదటి వారంలో తెలంగాణకు ప్రధాని మోడీ
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో భేటీ ఆనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలపై తాము ఇచ్చిన ప్రతిపాదనలకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
తెలంగాణకు రావాల్సిందిగా ప్రధానమంత్రిని ఆహ్వానించానని, మార్చి మొదటి వారంలో వస్తానని ఆయన చెప్పారని అన్నారు. రామగుండం ఎన్టీపీసీకి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ ద్వారా 2020 నాటికి 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని పీయూష్ గోయల్ ప్రకటించారు.
ఖమ్మం మణుగూరులో రెండేళ్లలో 1080 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని మంత్రి వెల్లడించారు. సోలార్ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ కోరారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో 3, 4 ఏళ్లలో 5,800 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
కాగా, శుక్రవారం ఉదయం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి సహాయం అందించాలని కోరారు.
రూ. 40 వేల కోట్ల రూపాయలతో మిషన్ భగీరథను ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపారు. దీనికి రూ. 10 వేల కోట్లు ఆర్థిక సాయం చేయాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎయిమ్స్ కోసం 2016-17 బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి హైకోర్టును కూడా విభజించాలని కేసీఆర్ మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఐటీఐఆర్ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన నిధులు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. తెలంగాణలో కరువు పరిస్థితులను తట్టుకునేందుకు రూ. 3,064 కోట్లు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు.