చండీయాగానికి రాష్ట్రపతి: పవార్ను ఆహ్వానించిన కేసీఆర్, యాగానికి వచ్చేందుకు వెంకయ్య ఓకే
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, రాజ్యసభ సభ్యుడు శరద్ పవార్ను సీఎం కేసీఆర్ శుక్రవారం కలిశారు. పుట్టినరోజు సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎంతో పాటు వచ్చిన టీఆర్ఎస్ ఎంపీలు కూడా పవార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా డిసెంబర్ 23 సీఎం కేసీఆర్ నిర్వహించనున్న ఆయుత చంఢీయాగానికి శరద్ పవార్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో శరద్ పవార్ మద్దతిచ్చిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో ఆయన రాష్ట్రంలో పర్యటించి తెలంగాణ అవసరాన్ని చాటారని పేర్కొన్నారు. అనంతరం కేసీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యను కలిసి ఆయుత చండీయాగానికి ఆహ్వానించారు.

దీనిపై స్పందించిన వెంకయ్య నాయుడు ఈ యాగానికి తప్పకుండా హాజరవుతానని శుక్రవారం ఢిల్లీలో తెలిపారు. కాగా, ఏపీ, తెలంగాణ శాసనసభ స్థానాలు పెంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, ఈ విషయంపై న్యాయశాఖతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పారు.
ఏపీ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు పెంచాలని, తెలంగాణలో శాసనసభ స్థానాలు 117 నుంచి 153 చేయాలని కోరుతున్నారని వివరించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేసీఆర్ చర్చించారని, ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం నుంచి కూడా విజ్ఞప్తులు అందాయన్నారు.
ఇక అమృత్ పథకం కింద తెలంగాణలో 12 నగరాలు ఎంపిక చేశామని వెంకయ్య వెల్లడించారు. హడ్కో కింద తెలంగాణకు రూ. 3100 కోట్ల రుణం మంజూరుకు సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపిందని చెప్పారు.
ఇది ఇలా ఉంటే కేసీఆర్ నిర్వహించనున్న ఆయత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా హాజరు కానున్నారు. ఆయన ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో యాగానికి వస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ 18వ తేదీన శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఆయన రాక నేపథ్యంలో తెలంగాణ సిఎస్ పోలీసులతో పలు శాఖల అధికారులతో భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications