గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నీ రీడిజైనింగ్: కేసీఆర్, నాసిరకంగా పుష్కర పనులు: మధుయాష్కి
హైదరాబాద్: గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నీ రీడిజైనింగ్ చేయాల్సి ఉందని అన్నారు. గోదావరి నీటి జలాల్లో 953 టీఎంసీలు వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని అన్నారు.
గోదావరి బేసిన్లో 54 నియోజక వర్గాలున్నాయని, ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లకు అనుగుణంగా ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై గత ప్రభుత్వాలు పూర్తిగా అలసత్వాన్ని ప్రదర్శించాయని, ఉమ్మడి రాష్ట్రంలో గోదావరిపై తలపెట్టిన ప్రాజెక్టులు తెలంగాణ అవసరాలు తీర్చేలా లేవని అన్నారు.
దీంతో తుమ్మిడిహట్టి వద్ద ఒకటి, కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు కడతామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజిస్తామన్నారు. గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నీ రీడిజైనింగ్ చేసే ప్రణాళికను వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సంస్థకు అప్పగించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రి హరీష్ రావుతో పాటు నీటిపారుదల శాఖ అధికారులు, వ్యాస్కోప్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పుష్కర పనులు నాసిరకంగా: మాజీ ఎంపీ మధుయాష్కి
తెలంగాణలో గోదావరి పుష్కర పనుల్లో నాణ్యత లోపించిందని నిజామాబాద్ మాజీ ఎంపీ, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాష్కి ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో కుటుంబ సమేతంగా గోదావరి నదిలో పుష్కర స్నానమాచరించారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పుష్కర ఘాట్ పనుల్లో నాణ్యత లోపించిందన్నారు. భక్తులకు తాగునీరు, రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం, అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు.