ఫాంహౌస్లో కేసీఆర్: సతీమణితో కలిసి చండీ హవన పూజ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు దంపతులు ఆయుత చండీయాగం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఈరోజు మెదక్ జిల్లాలోని జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.
డిసెంబర్ 23 నుంచి 27 వరకు సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగం చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం యాగం ప్రారంభానికి ముందు చేయాల్సిన ప్రత్యేక పూజలను తన సతీమణితో కలిసి నిర్వహించారు.
సాధారణ చండీయాగానికి ముందు దంపతులిద్దరూ హవన పూజ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం అక్కడకు తన సతీమణితో కలిసి వెళ్లిన కేసీఆర్ చండీ హవన పూజలు చేశారు. తాను నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుని కూడా ఆహ్వానించనున్నారు.
3 వేల మంది పండితులతో ఈ క్రతువును కేసీఆర్ నిర్వహిస్తున్నారు. సుమారు 10 వేల మంది ఈ మహా చండీయాగాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. యాగం కోసం పలు ప్రాంతాలు పర్యవేక్షించిన చివరకు కేసీఆర్ ఫాంహౌస్ ఎంచుకున్నారు.
యాగస్థలి కోసం వ్యవసాయ క్షేత్రంలోని 20 ఎకరాల భూమిని చదును చేశారు. ఇందులో కొంత భాగం అల్లం పంట ఉండటంతో, వాటిని తీసే పనులను వేగవంతం చేశారు. ఇది ఇలా ఉంటే చండీ హవన పూజ కోసం సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం తన ఫాంహౌస్కు చేరుకున్నారు.
యాగం పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆయూత మహా చండీయాగం నిర్వహిస్తామని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. గతంలోనూ ఆయన చండీయాగం చేశారు. 2006లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సహస్ర చండీయాగం చేశారు.