దేశ చరిత్రలో ఇది కొత్త అంకం: కెసిఆర్, ఇవాళే దీపావళి అని దత్తాత్రేయ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం సికింద్రాబాద్లో ఐడీహెచ్ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఇవాళ సంతోషకరమైన రోజు అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి వారిని సొంతింటి వారిని చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, అందుకే వారి కోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించామన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇది కొత్త అంకమన్నారు. ఇక నుంచి పేదలకు కట్టే ఇళ్లన్నీ డబుల్ బెడ్ రూంలే ఉంటాయని కెసిఆర్ తెలిపారు.
నియోజకవర్గానికి 400 చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తామని ఆయన పేర్కొన్నారు.మొత్తం 396 ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం అధికారులు ఎంపిక చేసిన ఐదుగురికి సీఎం పట్టాలు అందజేశారు.

తమ ప్రభుత్వం డబ్బా ఇళ్లు కట్టదని, డబుల్ బెడ్ రూం ఇళ్లే కడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి, పద్మారావు తదితరులు హాజరయ్యారు.
ఇవాళే నిజమైన దీపావళి: దత్తాత్రేయ
ఐడీహెచ్ కాలనీ వాసులకు నిజమైన దీపావళి ఈరోజేనని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. 'రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవ' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇది చరిత్రాత్మక ఘటన అని అభివర్ణించారు.
హైదరాబాద్ను మురికివాడలు లేని నగరంగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందని, హైదరాబాద్తో పాటు వరంగల్, సిద్ధిపేట, రామగుండం నగరాలను మురికివాడలు లేని వాటిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications