ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన - కటాఫ్ మార్కులు తగ్గింపు..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వేదికగా కీలక ప్రకటన చేసారు. తెలంగాణలోని పోలీసు నియామక పరీక్షల్లో కటాఫ్ మార్కులు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల అర్హత పరీక్షలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కటాఫ్ మార్కులు తగ్గించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కటాఫ్ మార్కులు 20 శాతం తగ్గించాలంటూ నిరసన ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఈ ప్రకటన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామక పరీక్షలో ఓసీ అభ్యర్థులకు 20 మార్కులు తగ్గించినట్లే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తగ్గించాలని బంజారాహిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్ని ఎమ్మార్పీఎస్ నాయకులు ముట్టడించారు. బలహీన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. శాసనసభలో విద్యుత్ సంస్కరణకు సంబంధించి చర్చ జరిగింది. చర్చకు సమాధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరును తప్పు బట్టారు. విద్యుత్ బిల్లును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేసారు. ప్రధాని మోదీ గురించి సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేసారు. దేశంలో విద్యుత్ సంస్కరణల ముసుగులో విద్యుత్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

కార్పోరేట్ వ్యక్తులకు వ్యవసాయం.. విద్యుత్ కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపుతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. జాతీయ - అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కొందరు కేంద్ర మంత్రుల తీరును తప్పు బట్టారు. కేంద్రం తమను ఏపీకి విద్యుత్ బకాయిలు నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించిందని.. ఏపీ నుంచి తమకే బకాయిలు రావాలని కేసీఆర్ స్పష్టం చేసారు. ఈ మేరకు లెక్కలు చెప్పుకొచ్చారు. ఈ చర్చ తరువాత ఈ కటాఫ్ మార్కుల పైన ముఖ్యమంత్రి ప్రకటన చేసారు.












Click it and Unblock the Notifications