ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పంట కొనుగోళ్లపై కీలక ప్రకటన.. వైఎస్ ఉచిత కరెంట్ ఉత్తదే అయిందన్న కేసీఆర్...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఉద్యోగులకు గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు.ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగానే వ్యవహరిస్తుందని చెప్పారు. ఉద్యోగులపై తమ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ గత పీఆర్సీతోనే నిరూపితమైందని చెప్పారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.. ఈ సందర్భంగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిరుద్యోగ భృతిపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు .. నిరుద్యోగుల స్పందన ఇదే !!
పీఆర్సీపై కేసీఆర్ ప్రకటన...
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే తెలంగాణ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారు. తాము దేశంలోనే అత్యధిక జీతాలు పొందుతున్నామని తెలంగాణ ఉద్యోగులు చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామన్నారు. ఇటీవలే తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్తో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఉద్యోగులకు 29శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు కేసీఆర్ అంగీకరించారని లీకులు వచ్చాయి. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు బహిరంగంగానే దీనిపై ప్రకటనలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఇలాంటి ప్రకటనలేంటని ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి.
పంట కొనుగోలుపై కీలక వ్యాఖ్యలు...
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల నేపథ్యంలో రాష్ట్రంలో మార్కెట్ యార్డుల కొనసాగింపుపై కేసీఆర్ స్పష్టతనిచ్చారు. కేంద్రం మార్కెట్ యార్డులను తొలగించినా సరే తెలంగాణలో కొనసాగిస్తామన్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా రైతుల నుంచి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కనీస మద్దతు ధరతో పంట కొనుగోళ్లు చేపడుతామని... రెండు పద్దతుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
నియంత్రిత విధానంలో వ్యవసాయ శాఖ రైతులకు ఇచ్చే కూపన్లతో వ్యవసాయ మార్కెట్లలో కొనుగోలు చేయడం ఒక పద్దతి అన్నారు. మరో పద్దతిలో కరోనా ప్రభావిత ప్రాంతాల్లో,మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు పెట్టి పంటను కొనుగోలు చేస్తుందన్నారు. కాబట్టి పంట కొనుగోళ్లపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రంలో 40లక్షల గోదాములు
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మరో 40లక్షల గోదాములను నిర్మించబోతున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఇందుకోసం ఆయా జిల్లాల పరిధిలో కలెక్టర్లు స్థలాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులు పూర్తయ్యే కొద్ది ఆయకట్టు మరింత పెరుగుతుందన్నారు. సగటున ఏడాదికి 15లక్షల నుంచి 20లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తవుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులకు పంట పెట్టుబడి కోసం రూ.15వేల కోట్లు రైతు బంధుకు ఖర్చు చేస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
వైఎస్ ఉచిత కరెంట్... ఉత్త కరెంటే...
రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే ప్రారంభించారని కేసీఆర్ గుర్తుచేశారు. అయితే ఉచిత విద్యుత్ అన్నారు గానీ అది ఉత్త కరెంట్ కిందనే మిగిలిపోయిందన్నారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో,ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలిసేది కాదన్నారు.కానీ రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. రైతాంగం మొత్తానికి 24గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఆనాడు 23 జిల్లాలతో కూడిన ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ లోడ్ 13,035మెగావాట్లుగా ఉంటే... ఈనాడు 10 జిల్లాల తెలంగాణలో అదనంగా మరో 500 మెగావాట్లు విద్యుత్ లోడ్ నమోదవుతున్నట్లు చెప్పారు. 2014లో తెలంగాణలో 12లక్షల ఎకరాల వరి సాగు ఉంటే... ఇవాళ 52లక్షల 28వేల ఎకరాల వరి సాగుతో దేశంలోనే నంబర్.1గా రాష్ట్రం నిలిచిందన్నారు. ఇదంతా టీఆర్ఎస్ ప్రభుత్వ కృషి వల్లే జరిగిందన్నారు.