ఉద్యోగులకు మధ్యంతర భృతి - ఎప్పటి నుంచి అమలంటే..!?
ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్. మధ్యంతర భృతి అమలు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. పీఆర్సీ..ఐఆర్ పై ఇప్పటికే సీఎం శాసనసభలో స్పష్టత ఇచ్చారు. పీఆర్సీ నియామకం పైన అధికారులు నివేదిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి పీఆర్సీ నియామకం పైన నిర్ణయంతో పాటుగా మధ్యంతర భృతిని ప్రటిస్తారని తెలుస్తోంది. అమలు పైనా సంకేతాలు అందుతున్నాయి.
ఉద్యోగ సంఘాలతో సమావేశం : తెలంగాణ ప్రభుత్వం రెండో వేతన సవరణ సంఘం ఏర్పాటు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. మరో వారం రోజుల్లోనే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఆ సమావేశం లో పీఆర్సీ నియామకం పైన ప్రకటన చేయనున్నారు. అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ జారీ అవుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో, పీఆర్సీ నియామకం తరువాత అధ్యయనం.. నివేదిక కు సమయం పట్టనుండటంతో ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నుంచే అమలయ్యేలా ఈ నిర్ణయం ఉంటుందని ఉద్యోగ సంఘాలు అంచనా వేస్తున్నారు. ఎంత మేర ప్రకటిస్తే ఏ మేర భారం పడుతుందనే లెక్కల తయారీలో ఆర్దిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

పీఆర్సీ..ఐఆర్ ప్రకటన దిశగా : ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో బడ్జెట్ లో ప్రభుత్వం రూ 38,627.52 కోట్లు ఉద్యోగుల జీత భత్యాలకు కేటాయించింది. ప్రతీ నెలా జీతాలు, ఫించన్లు కలిపి రూ 4,500 కోట్ల దాకా వ్యయం అవుతోంది. మధ్యంతర భృతి 10 శాతం ఇచ్చినా ప్రతీ నెలా రూ 300 కోట్ల అదనపు ఆర్దిక భారం పడుతుందని అంచనా వేసారు. సెప్టెంబర్ నుంచి అమలు చేస్తే ఈ ఆర్డిక సంవత్సరంలో మిగిలిన ఏడు నెలలకు దాదాపుగా రూ 3,600 కోట్లు అదనంగా కేటాయించామల్సి ఉంటుంది. గత ఆర్దిక సంవత్సరంతో పోలిస్తే జీతభత్యాలకు ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే రూ 943.56 కోట్ల మేర భారం పెరిగింది. అయినా, ఉద్యోగులకు అనుకూలంగానే మధ్యంతర భృతి పై నిర్ణయం తీసుకోవటానికి ప్రభుత్వ సిద్దమైంది.
వచ్చే నెల నుంచే అమలయ్యేలా : ఎన్నికల సమయం కావటంతో ఇచ్చిన అన్ని హామీల దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ నెలలోనే పెండింగ్ రుణమాఫీ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందు కోసం అయిదారు వేల కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. రైతు బంధు, సంక్షేమ ఫించన్లు, సంక్షేమ పథకాల రాయితీల కలిపి నిధుల సమీకరణకు ఆర్దిక శాఖ ఇబ్బంది పడుతోంది. భూముల వేలం, ఓఆర్ఆర్ కాంట్రాక్టు డిపాజిట్ల ద్వారా రాబోయే రెండు నెలల్లో రూ 10 వేల కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఉద్యోగుల మధ్యంతర భృతి ఏ మేర ప్రకటిస్తారనేది ఉద్యోగులు, పెన్షనర్లోలో ఉత్కంఠ పెంచుతోంది. ఎన్నికల సమయం కావటంతో ఆశాజనంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications