ఆంధ్రా టీడీపీ ఫ్లెక్సీలో తెలంగాణ సీఎం ఫొటో, ఆ ఊరిలో.. అంతే! కేసీఆర్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్!
ప్రకాశం జిల్లా బల్లికురువ మండలంలోని వెలమవారిపాలెం గ్రామ సర్పంచి, టీడీపీ నాయకుడు ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటో ఉండడం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది
ప్రకాశం: అది ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రామం. అక్కడ కట్టిన ఓ ఫ్లెక్సీలో ఆంధ్రా సీఎం చంద్రబాబునాయుడి పక్కనే తెలంగాణ సీఎం కేసీఆర్ ఫొటో అందరినీ ఆకర్షిస్తోంది. అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ.
వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా బల్లికురువ మండలంలోని వెలమవారిపాలెంలో ఈ ఫ్లెక్సీ వెలిసింది. దీనిని ఏర్పాటు చేసింది.. ఆ గ్రామ సర్పంచి మామిళ్లపల్లి ప్రవీణ్ కుమార్. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఇతర నాయకులు వెలమవారిపాలేనికి వస్తున్న సందర్భంగా ఈ ఫ్లెక్సీని ఏసీర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ఆ పక్కన చంద్రబాబు, చివరన కేసీఆర్ ఫోటోను పెట్టారు. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. వెలమవారిపాలెంలో 90 శాతం వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే. అందుకే ఆ గ్రామంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ఫాలోయింగ్.
తమ సామాజిక వర్గానికే చెందిన తెలంగాణ సీఎం అంటే తమకు ప్రత్యేకమైన అభిమానమని, అందుకే తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలోనూ కేసీఆర్ ఫొటో పెట్టామని గ్రామ సర్పంచి ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్లెక్సీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో అటు ఏపీలో, ఇటు తెలంగాణలో విధ్వేషాలు భగ్గుమన్నాయి. రెండు రాష్ట్రాలు విడిపోయి మూడేళ్లయిన తరుణంలో క్రమంగా ఆ విభేదాలన్నీ తగ్గుముఖం పడుతున్నాయి.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల ప్రజలు కలిసిమెలసి ఉండాలని కోరుకుంటున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు కూడా సామరస్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రులు కూడా సుహృద్భావ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications