అలా లేకుంటే నా ఇజ్జత్ పోతది, కవిత రూ.50 లక్షలిస్తారు: కెసిఆర్
నిజామాబాద్: నేను ముఖ్యమంత్రి అయ్యాక కూడా మోతె గ్రామం బాగా లేకుంటే నా ఇజ్జత్ (పరువు) పోతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం మోతె గ్రామంలో హరితహారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కెసిఆర్, కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ పాఠశాలలో కెసిఆర్ మొక్క నాటారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.
మోతె కేసీఆర్ సొంత ఊరని, కేసీఆర్ సొంత ఊరు అభివృద్ధి కాకుండా నా పరువు పోతుందన్నారు. మోతెను అందరు మెచ్చుకునేలా చేస్తానన్నారు. భగవంతుడి దయతో తెలంగాణ వచ్చిందని, మోతెను మరిచిపోనన్నారు. మోతె మట్టి తీసుకెళ్లి ఊళ్లల్లోని బావుల్లో కలిపితె బాగుంటుందన్నారు.
ఈ మట్టి ద్వారా ఇక్కడి ప్రజల మాదిరిగా అందరూ బలంగా అవుతారన్నారు. మోతె మట్టి అంత పవర్ ఫుల్ అన్నారు. మోతెలో మోరీల నిర్మాణానికి రూ.2 కోట్లు ఇస్తామని, అదీ చాలకుంటే మీ ఎంపీ కవిత మరో రూ.50 లక్షలు ఇస్తారని కెసిఆర్ చెప్పారు.
మోతెకు తప్పకుండా నీరు అందిస్తామన్నారు. గ్రామం పచ్చదనంతో కళకళలాడాలన్నారు. మోతెలో ఓ నర్సరీయే ఏర్పాటు చేయాలన్నారు. నిజామాబాదులో చెట్లు బాగా నరకడం వల్లనే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని కెసిఆర్ చెప్పారు.
మోతెలో ఇండ్లు లేని వారి ఉండవద్దన,ి ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్స్ కట్టిస్తామన్నారు. రెండు అంతస్తుల విధానం ఇండ్లు కడతామని, గ్రామపంచాయతీ భవనానికి రూ. 80 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సీసీ రోడ్లు, మోరీల నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తామని, ఈ నిధులు సరిపోక పోతే ఎంపీ కవిత తన ఫండ్స్ నుంచి రూ. 50 లక్షలు ఇస్తారన్నారు.
అత్యాధునిక ప్రమాణాలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కట్టిస్తామన్నారు. 5 ఎంఏ ట్రాన్స్ఫార్మర్స్ను త్వరలోనే పెట్టిస్తామన్నారు. మోతెలోనే నర్సరీ ఏర్పాటు చేస్తామని, ఇక మీరు మొక్కలు బయటికి పోయి తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. మిగతా గ్రామాలకు 40 వేల మొక్కలు ఇస్తున్నామని, మోతె గ్రామానికి ఒక వెయ్యి మొక్కలు ఎక్కువనే ఇస్తామన్నారు.
వానలు రావాలంటె చెట్లు నాటాలని, చెట్లు నాటినప్పుడే వర్షాలు బాగా కురుస్తాయని, కోతులను అడవులకు వాపస్ పంపాలన్నారు. మోతె గ్రామానికి గోదావరి జలాలు తీసుకొస్తామన్నారు. గోదావరి జలాలతో రైతులు పంటలు పండించాలన్నారు.
కాళేశ్వరం ద్వారా మోతె గోదావరి జలాలు వస్తాయని, త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామన్నారు. గ్రామంలోని 3,800 ఎకరాల్లో 3 వేల ఎకరాలు వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయని, మోతె రైతులుందరికీ 100 శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలు ఇస్తామన్నారు. మోతెలో నూటికి నూరు శాతం డ్రిప్ ఇరిగేషన్తో పంటలు పండించాలన్నారు.