కేంద్రంపై మరో యుద్ధానికి సీఎం కేసీఆర్ రెడీ... నేడు ఢిల్లీకి తెలంగాణా మంత్రులు
తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి రెడీ అయిన విషయం తెలిసిందే. యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం కేసీఆర్ తెలంగాణ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణ నిర్దేశించారు.
ఢిల్లీకి తెలంగాణా మంత్రుల బృందం
కేంద్రంపై యుద్ధానికి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ మంత్రుల బృందం దేశ రాజధాని ఢిల్లీకి ప్రయాణమవుతున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీకి మంత్రి హరీష్ రావ్, పువ్వాడ అజయ్ కుమార్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. యాసంగిలో వడ్లు కొనాల్సిందే అని, కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేయించడమే లక్ష్యంగా తెలంగాణ మంత్రుల బృందం ప్రయత్నాలు సాగిస్తుంది.
కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవటానికి సిద్ధమైన కేసీఆర్
ఇప్పటికే అనేక మార్లు వడ్లు కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంపై వార్ కు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు అక్కడక్కడా ప్రారంభం కాగా పూర్తి స్థాయిలో ధాన్యం మార్కెట్లోకి రాకముందే కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పోరుబాట పట్టింది.
పీయూష్ గోయల్ ను కలిసి విజ్ఞప్తి చెయ్యనున్న మంత్రుల బృందం
అందులో భాగంగా నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ లతో కూడిన బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిసి తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయనకు వినతిపత్రం సమర్పించారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు తో పాటు, తెలంగాణ టిఆర్ఎస్ ఎంపీలు కూడా మంత్రి పీయూష్ గోయల్ ను కలిసి యాసంగి ధాన్యం కొనుగోలుకు ఆయనపై ఒత్తిడి తీసుకురానున్నారు.
వరిసాగు చేసి కోతలు కోస్తున్న రైతుల్లో ఆందోళన
ఇప్పటికే కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం చాలాచోట్ల వరి సాగు చేసి కోతలు కూడా మొదలు పెట్టారు. ధాన్యం కొనుగోలుపై వివాదం కొనసాగుతున్న సమయంలోనే రైతులు 35.84 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ప్రస్తుతం వరి కోతలు కోస్తున్న రైతులు ధాన్యం అమ్మకాలు ఎలా అన్న దానిపై ఆందోళనలో ఉన్నారు.
కేంద్రంపై కేసీఆర్ సమరం... తెలంగాణా రాజకీయాల్లో ఆసక్తి
ఇప్పటికే ఈ యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. కేంద్రం కొనేది లేదని తేల్చి చెప్పింది. ఇక ఈ సమయంలో సీఎం కేసీఆర్ కేంద్రంపై వార్ ప్రకటించారు. అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకోకుంటే, తెలంగాణ రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేస్తామని భరోసా ఇవ్వకుంటే ఉద్యమ బాట పట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో ఈ వ్యవహారంలో ఏం జరగబోతుందో అన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.