తలసానికి నేను ఝలకివ్వలేదు: కెసిఆర్, 'చంద్రబాబు రాయబారం నెరపినా'
ఖమ్మం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు తాను ఝలక్ ఇచ్చినట్లుగా వచ్చిన వార్తల పైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం నాడు స్పందించారు. తాను తలసానికి ఝలక్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజా నాయకుడు అని, అందుకే ఆయనకు ప్రజలతో సంబంధం ఉండే శాఖను అప్పగించానని చెప్పారు. ఆయనకు నేను షాకివ్వలేదన్నారు. శాఖల విషయంలో తాము వారం రోజుల ముందే ఇద్దరం చర్చించుకున్నామని చెప్పారు.
వాణిజ్య పన్నుల శాఖతో ప్రజలకు సంబంధం ఉండదని చెప్పారు. అందుకే ప్రజలతో సంబంధం ఉండే శాఖను తలసానికి అప్పగించానని చెప్పారు.
కాగా, అంతకుముందు తెరాస ప్లీనరీలో కెసిఆర్ మాట్లాడారు. తాను తెలంగాణ ఉద్యమంలోకి దూకాలనుకున్న సమయంలో తనకు ఇష్టమైన మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారని, కానీ తాను తగ్గలేదని కెసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం.. మేధావులు, విద్యార్థులు, ఎన్జీవోలతో కెసిఆర్ చర్చలు జరిపారని, విషయం తెలిసిన చంద్రబాబు.. కెసిఆర్కు కోరుకున్న మంత్రి పదవి ఇచ్చేందుకు రాయబారం పంపారని, దానిని కెసిఆర్ సున్నితంగా తిరస్కరించారని వక్తలు చెప్పారు. ఇవే వ్యాఖ్యలను ఆ తర్వాత బాలమేధావి లక్ష్మీ శ్రీజ సభా వేదిక పైన చెప్పినప్పుడు కెసిఆర్ ముసిముసిగా నవ్వారు.
కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు: జగదీశ్వర్ రెడ్డి
తెరాస ప్లీనరీలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తమస్సు నుంచి ఉషస్సులు - తెలంగాణలో నిరంతర విద్యుత్పై ఎనిమిదో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో విద్యుత్ లేకుండా వ్యవసాయం లేదన్నారు. ఉద్యమ కాలం నుంచే సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారన్నారు.
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదని, ఇప్పుడు పది నిమిషాలు కరెంట్ పోతేనే విచిత్రమన్నారు. 2009లో తెలంగాణ ప్రకటన వచ్చినప్పటి నుంచే సీఎం కేసీఆర్ తెలంగాణ విద్యుత్ సమస్యపై దృష్టి పెట్టారని, కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడన్నారు.
ఇచ్చిన హామీ మేరకు రైతులకు తొమ్మిది గంటల పగటిపూట విద్యుత్ ఇస్తున్నామని, ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వేయొద్దని సీఎం కేసీఆర్ చెప్పారని, నలభై ఏల్లకు సరిపడా విద్యుత్ ప్రణాళిక తయారు చేయాలని సీఎం ఆదేశించారని, ఆ దిశగా పయనం సాగిస్తున్నామన్నారు.