నూతన మద్యం పాలసీ, ఆంధ్రా పాలకుల వల్లే కల్తీ కల్లు: కేసీఆర్
హైదరాబాద్: అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. సచివాలయంలో శుక్రవారం ఆయన నూతన మద్యం పాలసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ మద్యం విధానాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు.
గుడుంబాను అరికట్టాలని మహిళల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుందని అన్నారు. చిన్నతనంలోనే గుడుంబాకు బానిసలై ప్రాణాలు కోల్పోవడం వల్ల మహిళలు వితంతువులుగా మారుతున్నారని తెలిపారు. గుడుంబా మహమ్మారితో ఎన్నో కుటుంబాలు అనాథలు అవుతున్నాయని, ప్రాణాలకు హాని కలిగించని మద్యాన్ని తయారు చేయాలని సూచించారు.
నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం అక్రమ రవాణాను నిలవరించాలని పేర్కొన్నారు. ఎక్సైజ్ పోలీసులకు, సివిల్ పోలీసులకు మధ్య పరస్పర సహకారం ఉండాలని సూచించారు. త్వరలో రెండు శాఖల సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. హైదరాబాద్ మహా నగరంలో ఎన్నో ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉన్నారని, అందువల్ల అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని నూతన మద్యం పాలసీని తెస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆంధ్రా పాలకుల వల్లే రాష్ట్రంలో కల్తీ కల్లు ఏరులై పారుతుందని మండిపడ్డారు. చెరువు కట్టల వద్ద పెద్ద ఎత్తున ఈత చెట్లు పెంచాలని అన్నారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందు కోసం ఇద్దరు డీఎఫ్ఓలను కేటాయిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కల్తీ కల్లు వల్ల ప్రజల మానసిక పరిస్ధితి దెబ్బతింటుందని తెలిపారు.
రాష్ట్రంలో కల్తీ కల్లు లేకుండా చేయాలని అన్నారు. రాష్ట్రంలో వినియోగమయ్యే మద్యం ఇక్కడే తయారయ్యే విధంగా డిస్టిలరీస్ ఉండాలని సూచించారు. అన్ని రకాల కంపెనీలు, బ్రాండ్ల మద్యం ఇక్కడే తయారు కావడం వల్ల తెలంగాణలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, దాంతో రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుందని అన్నారు.