‘ముందస్తు’కే కేసీఆర్ మొగ్గు! ముఖ్యనేతలు, కీలక అధికారులతో సమాలోచనలు!
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలతో సంబంధం లేకుండా వేరుగానే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఆయన ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
Recommended Video
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ఆదరణ బాగుందని, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మేలని భావించిన గులాబీ పార్టీ అధినేత అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యనేతలు, అధికారులకు సంకేతాలు...
ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే పార్టీకి అన్ని విధాలా శ్రేయస్కరం అని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ విషయమై పార్టీలోని ముఖ్యనేతలకు, ప్రభుత్వంలోని కీలక అధికారులకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారని, పెండింగ్లో ఉన్న పథకాలను నెలకొకటి చొప్పున ప్రారంభించడం కేసీఆర్ ముందస్తు వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డిసెంబర్లోపు అభివృద్ధి పథకాలు పూర్తి...
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న నేపథ్యంలో వీలైనంత త్వరలో అభివద్ధి పథకాలు పూర్తి చేయాలని కూడా సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా తనను కలిసిన కొంతమంది పార్టీ ముఖ్య నేతలకు కూడా ఆయన ఇదే సూచించనట్లు సమాచారం. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలను ఈ ఏడాది డిసెంబర్లోపు పూర్తి చేయాలని, ఆయా పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వారికి కేసీఆర్ సూచించినట్టు తెలిసింది.
అధికారుల బదిలీలు అందుకేనా?
ఆయా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలంటే అందుకు అధికారుల సహకారం కూడా అవసరమని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కొందరు ఐఎఎస్ అధికారులు అభివృద్ధి పనులకు సహకరించడం లేదని పార్టీలోని కొందరు సీనియర్ నేతలు సీఎంకు సూచించిన విషయం తెలిసిందే. కొంతమంది అధికారులు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలోనే భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అనుకూల అధికారులకు ప్రాధాన్య పోస్టులు...
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతంగా పూర్తి చేయాలంటే పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, తమకు అనుకూలురైన వారిని ఆయా శాఖల్లో నియమించాలని ఇటీవల పార్టీ నేతలు సీఎం కేసీఆర్పై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని,
రాష్ట్రంలో భారీ స్థాయిలో అధికారుల బదిలీలు జరగడం కూడా దాన్నే సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. సహకరించని అధికారులను ప్రాధాన్యత లేని శాఖలకు మార్చి, ఉపయోగపడతారనుకున్న వారికి అత్యంత ప్రాధాన్యం ఉన్న శాఖలు ఇచ్చారని, అంతేకాకుండా వచ్చే నవంబర్, డిసెంబర్లోనే ఎన్నికలు ఉండొచ్చని ఒక మాట కూడా వారి చెవిన వేసినట్టు సమాచారం.
టీఆర్ఎస్కు అనుకూల పవనాలు...
ప్రస్తుతం టీఆర్ఎస్కు రాష్ట్రంలో అనుకూల పవనాలు ఉన్నాయని భావిస్తున్నందునే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరతీశారని చెబుతున్నారు. నిజానికి 2019 మార్చి నెలలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆలోగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కొత్త పార్టీలు కూడా పుట్టుకురావచ్చనే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉంది. కొత్త పార్టీల వల్ల నష్టం పెద్దగా ఉండకపోయినా, ఓట్ల శాతం తగ్గే ప్రమాదం ఉంటుందని, ఆ పార్టీలు క్షేత్రస్థాయిలో మరింత లోతుగా ప్రజల్లోకి వెళ్లకముందే ముందస్తు ఎన్నికలకు వెళితే లాభం ఉంటుందని పార్టీలోని సీనియర్ నాయకులు కూడా అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
అభివద్ధి పనుల పూర్తికి మౌఖిక ఆదేశాలు...
ముందస్తు ఎన్నికల ఆలోచన నేపథ్యంలో.. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా చేపట్టిన పనుల్లో నిధుల కొరత అడ్డంకిగా ఉంటే వెంటనే సమాచారం అందించాలని కూడా సూచించినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని, ఈ ఏడాదిలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్న దృష్ట్యా అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశించినట్లు తెలుస్తోంది.