హైదరాబాద్ మెట్రో జర్నీ మరింత హ్యాపీ : 120 కి.మీ వేగం - డైనమిక్ టెక్నాలజీ..!!
Hyderabad Metro: హైదరాబాద్ నగరంలో చారిత్రక ఘట్టం ఆవిష్కారం కానుంది. హైదరాబాద్ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి నేడు కీలక అడుగు పడనుంది. లక్షలాది మంది ప్రజలకు సౌకర్యవంతంగా మారిన హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సిద్దమైంది. ఎన్నో ప్రత్యేకతలతో జాతీయ స్థాయిలోనూ మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్ మెట్రో మరో రికార్డు సాధించనుంది. మెట్రో రెండో దశలో భాగంగా... రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపడుతున్న పనులకు భూమి పూజ జరగనుంది. ఈ కారిడార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రూ.6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల పొడవున ఈ లైన్ను నిర్మిస్తారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేవారికి సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.
మైండ్ స్పేస్ వద్ద సీఎం కేసీఆర్ భూమి పూజ
మైండ్ స్పేస్ - శంషాబాద్ మెట్రో లైన్ పనులను హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంల్) ఆధ్వర్యంలో చేపడుతున్నారు. మూడేళ్లలో దీన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో మార్గంలో ప్రయాణీకుల రద్దీ ఆధారంగా స్టేషన్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ రూట్ లో భాగంగా ఇప్పటికే డీపీఆర్ సిద్దం చేసారు. ఎంత మేర ప్రయాణీకులకు తాజా ప్రతిపాదనతో ఉపయోగం జరగనుందో అధికారులు అంచనా వేసారు. మైండ్స్పేస్ తర్వాత బయోడైవర్సిటీ, నానక్రామ్గూడ, నార్సింగి, తెలంగాణ పోలీస్ అకాడమీ, రాజేంద్రనగర్, శంషాబాద్ టౌన్, ఎయుర్పోర్టు కార్గోస్టేషన్, టర్మినల్ వద్ద స్టేషన్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దం అయ్యాయి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రస్తుతం రోజూ 40 పుష్పక్ ఎలక్ర్టిక్ ఏసీ బస్సుల్లో దాదాపుగా 5వేల మంది ప్రయాణిస్తుంటారు. శని, ఆదివారాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఓఆర్ఆర్ పక్కన ఉన్న గ్రామాల ఉద్యోగులు, ప్రజలు వందలాదిగా బస్సులు, క్యాబ్ల్లో నిత్యం నగరానికి వచ్చివెళ్తుంటారు. ఈ నేపథ్యంలో... మెట్రో ఎయిర్పోర్టు ఎక్స్ప్రెస్ కారిడార్ ద్వారా వీరందరికీ మెట్రో విస్తరణ ద్వారా మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
పీపీపీలో రెండో అతి పెద్ద మెట్రో - భూగర్భ లైన్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిన అందుబాటులోకి వచ్చిన మెట్రోరైల్ ప్రాజెక్టులో హైదరాబాద్ రెండోస్థానంలో ఉంది. ఢిల్లీలో 351 కిలోమీటర్ల మేర మెట్రో రైళ్లు పరుగులు తీస్తుండగా, హైదరాబాద్లో మూడు మార్గాల్లో 69 కి.మీ. పూర్తయి రాకపోకలు సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు హైదరాబాద్లో పూర్తయిన 3 కారిడార్లలో నిత్యం 4 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.మరిన్ని ప్రాంతాలకు మెట్రో సేవలు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో రెండోదశను ప్రారంభించనున్నది. ఈ దశలో రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్పోర్టు (31కి.మీ), బీహెచ్ఈఎల్-లక్డీకాపూల్ (26 కి.మీ.), నాగోలు-ఎల్బీనగర్ (5 కి.మీ.) మొత్తం 62 కిలోమీటర్లు విస్తరించేందుకు డీపీఆర్లను సిద్ధం చేసింది. భవిష్యత్తులో 2041 నాటికి మొత్తం 204 కి.మీ మేర మెట్రో మార్గాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. తాజాగా సిద్దం చేసిన మార్గం లో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు (31 కి.మీ.) వరకు కేవలం 26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్ మెట్రో రైల్ ఏర్పాట్లు చేస్తున్నది. పిల్లర్లతోపాటు 2.5 కిలోమీటర్ల మేర భూగర్భంలో రైలు మార్గాన్ని నిర్మించనున్నది. అవుటర్ రింగ్రోడ్డు వెంట నిర్మించే ఈ మార్గంలో 120 కి.మీ వేగంతో ప్రయాణించేలా ఎయిరో డైనమిక్ టెక్నాలజీని వినియో గించనున్నారు.
31 కిలోమీటర్లు..26 నిమిషాల్లో
రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు (31 కి.మీ.) వరకు కేవలం 26 నిమిషాల్లో ప్రయాణించేలా హైదరాబాద్ మెట్రో రైల్ ఏర్పాట్లు చేస్తున్నది. విమానాశ్రయానికి త్వరగా చేరేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. 27 కిలోమీటర్లు ఎలివేటెడ్ (ఆకాశమార్గంలో), ఒక కిలోమీటరు రోడ్ లెవెల్లో, 2.5 కిలోమీటర్ల వరకు భూగర్భ మార్గంలో (అండర్గ్రౌండ్) ట్రాక్ నిర్మాణం ఉంటుంది. అలాగే మైండ్ స్పేస్ జంక్షన్ స్టేషన్లో విదేశాలకు వెళ్లేవారి లగేజీలను చెకిన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తారు. భూసేకరణ పూర్తయితే మెట్రో పనులను మూడేళ్లలో పూర్తి చేసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత మెట్రో స్టేషన్ల కంటే ఎయిర్పోర్టు మెట్రో స్టేషన్లు క్లోజ్డ్ సర్క్యూట్తో ఉంటాయి. రైలు వచ్చినప్పుడే ప్లాట్ఫాం గేట్లు తెరుచుకొంటాయి. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు 8-9 స్టేషన్లు ఉండనున్నాయని, కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా ఉంటాయి. కేంద్రం సహకరించకపోయినా ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్నారు.