కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా- కొత్త షెడ్యూల్ ఇదే..!!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించ తలపెట్టిన మెదక్ జిల్లా పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవడం, భారీ వర్ష సూచనల నేపథ్యంలో- ఈ పర్యటనను వాయిదా వేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. దీన్ని ఈ నెల 23వ తేదీకి షెడ్యూల్ చేసినట్లు వెల్లడించింది.
ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్.. కొంతకాలంగా విస్తృతంగా జిల్లాల్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన మంచిర్యాల్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్.. వంటి జిల్లాల్లో సుడిగాలి పర్యటలను నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను ప్రారంభించారు.

ఈ నెల 19వ తేదీన తన సొంత జిల్లా ఉమ్మడి మెదక్తో పాటు, సూర్యాపేట్ జిల్లాకు బయలుదేరి వెళ్లాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ సైతం ఖరారైంది. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మెదక్ చర్చి కాంపౌండ్లో ప్రగతి నివేదిన, బహిరంగ సభను నిర్వహించాలని అంటూ పార్టీ యంత్రాంగం కూడా సన్నద్ధమైంది.
అదే సమయంలో ఈ నెల 19వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో దీన్ని వాయిదా వేసుకున్నారు కేసీఆర్. ఈ నెల 23వ తేదీకి షెడ్యూల్ చేశారు. సూర్యాపేట్ జిల్లా పర్యటన మాత్రం షెడ్యూల్ ప్రకారం యధాతథంగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నెల 20వ తేదీన సూర్యపేట్లో కేసీఆర్ పర్యటిస్తారు. జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాల భవన సముదాయాలను ప్రారంభిస్తారు. అక్కడే ప్రగతి నివేదన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీని తరువాత మెదక్ పర్యటన షెడ్యూల్ అయింది. 23వ తేదీన కేసీఆర్ మెదక్కు బయలుదేరి వెళ్తారు.












Click it and Unblock the Notifications