మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి... కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న పీవీ ఘాట్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పీవీ శతజయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్తో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్,పలువురు మంత్రులు,ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. పీవీ గౌరవార్థం ఇప్పటికే నెక్లెస్ రోడ్ను ప్రభుత్వం పీవీ మార్గ్గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే.
పీవీ శతజయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ప్రధాని మోదీ...'మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు 100వ శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులు. దేశాభివృద్దికి ఆయన చేసిన కృషిని ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. మేదస్సు,చాణక్యం ఆయనలోని అద్భుత లక్షణాలు.' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతేడాది జూన్లో మన్ కీ బాత్ సందర్భంగా పీవీని ఉద్దేశించి మాట్లాడిన ఆడియో క్లిప్ను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.
పీవీ బహుముఖ ప్రజ్ఞశాలి అని,సాహితీవేత్త అని ఆ సందర్భంగా మోదీ కొనియాడారు.స్నేహితులతో కలిసి ఆయన స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. ఆనాటి నిజాం రాజు వందేమాతర గీతాలపనకు అనుమతి ఇవ్వలేదని... దీంతో నిజాంపై జరిగిన వ్యతిరేక పోరులో పీవీ కీలక పాత్ర పోషించారని అన్నారు. అప్పటికీ ఆయన వయసు 17 సంవత్సరాలే అని చెప్పారు. చిన్నతనం నుంచే అన్యాయంపై పోరాడే తత్వం ఆయనలో ఉందన్నారు.
Live: CM Sri KCR addressing the gathering at Sri #PVNarasimhaRao Centenary Celebrations closing ceremony https://t.co/mNhvrDzYOB
— Telangana CMO (@TelanganaCMO) June 28, 2021
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పీవీ సేవలను కొనియాడారు. భారత్లో ఆర్థిక సంస్కరణలకు పీవీ ఒక మార్గదర్శి అన్నది నిర్వివాదాంశమని పేర్కొన్నారు. దేశాభివృద్ది కోసం ఆయన చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని అన్నారు. 'రాజనీతిజ్ఞుడు,దార్శనికుడు,సుపరిపాలకుడు శ్రీ పీవీ నర్సింహారావు గారికి నా నివాళి.' అని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ పీవీ నర్సింహారావు శత జయంతిపై ట్విట్టర్లో స్పందించారు.'ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన దార్శనికుడు, బహుభాషా కోవిదులు, తెలంగాణ ముద్దు బిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి' అని పేర్కొన్నారు.