టీఆర్ఎస్ విజయ గర్జన సభకు ముందే నవంబర్ 10న వరంగల్, హన్మకొండ జిల్లాలకు సీఎం కేసీఆర్... రీజన్ ఇదే !!
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఊహించని మార్పులు టీఆర్ఎస్ పార్టీలోనూ, అధినేత కేసీఆర్ లోనూ కనిపిస్తున్నాయి. గతంలో ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోని కేసీఆర్ ఇక వదిలి పెట్టబోమని సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదే సమయంలో పార్టీని బలోపేతం చెయ్యటంతో పాటు, పలు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ దిద్దుబాటు బాట పట్టారని , త్వరలోనే తెలంగాణా జిల్లాల పర్యటన చేస్తారని వార్తలు వచ్చిన సమయంలో కేసీఆర్ బుధవారం నాడు వరంగల్, హన్మకొండ జిల్లాలలో పర్యటించనున్నారని తెలుస్తుంది.
నవంబర్ 10న సీఎం కేసీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన
గులాబీ బాస్ కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా చూసి, ప్రజలతో మమేకం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికలప్పుడు తప్ప మిగతా సమయంలో కేసీఆర్ జనాల్లోకి రారు అన్న అపవాదుకు చెక్ పెడుతూ ఆయన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వరంగల్, హన్మకొండ జిల్లాలకు నవంబర్ 10 వ తేదీన కేసీఆర్ రానున్నారు.
స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు
ఈనెల 10 వ తేదీ, బుధవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజాప్రతినిధులు చేస్తున్న విజ్జప్తులు, స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై కీలక ప్రకటనలు చెయ్యనున్నారు. వరంగల్ దక్షిణ భాగంలో ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్లు జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు, వరంగల్ హన్మకొండ జంటనగరాల రవాణాకు, అభివృద్ధికి అవరోధంగా వున్న రైల్వే ట్రాక్ ల మీద రైల్వే ఓవర్ బ్రిడ్జి ( ఆర్ వో బి) ల నిర్మాణం, తదితర అభివృద్ధి అంశాలపై స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్షజరిపి, సిఎం కెసిఆర్ పలు కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.
హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్
వరంగల్ ఇంటర్నల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు చేపట్టవలసిన చర్యలపై, అలాగే వరంగల్ టెక్స్ టైల్ పార్క్ పనుల పురోగతి అంశాలను సిఎం సమీక్షించనున్నారు. హన్మకొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ అదే రోజు ప్రారంభించనున్నారు.సీఎం కేసీఆర్ పర్యటన నేపధ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. ఇదే సమయంలో అధికారులు కూడా పర్యటన ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. సీఎం కేసీఆర్ నవంబర్ 29 వ తేదీన వరంగల్ లో టిఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభ నిర్వహించనున్న క్రమంలో ఆ సభకు ముందే వరంగల్,హన్మకొండ జిల్లాలలో పర్యటన చెయ్యటం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ పర్యటన .. ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు, గులాబీ బాస్ రాకపై ఆసక్తికర చర్చ
ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకుడిగా సీఎం కేసీఆర్ ను ప్రతిపక్షాలు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న క్రమంలో వారికి చెక్ పెట్టడం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగినట్టుగా తాజాగా చర్చ జరుగుతుంది . రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా అధికారిక కార్యక్రమాలతో పాటుగా, పార్టీకి సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ తన పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
దీనికోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.కేసీఆర్ హన్మకొండ, వరంగల్ జిల్లాల పర్యటన నేపధ్యంలో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహమే కాదు హుజురాబాద్ ఎన్నికల బాధ్యత నిర్వహించిన కేంద్రు నేతల్లో టెన్షన్ కూడా కనిపిస్తుంది.