బుద్ధ పూర్ణిమ,గౌతమ బుద్ధుని జయంతి సందర్బంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు.!
హైదరాబాద్: గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతి కోసం బౌద్ధమతం చూపిన బాట నేటికీ ఆచరణీమయన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానం, వీటిలోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయని సిఎం చంద్రశేఖర్ రావు వివరించారు. ఫణిగిరి వంటి నాటి బౌద్దారామాల్లో బయల్పడుతున్న అరుదైన బౌద్ద చారిత్రక సంపంద, గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలను అల్లుకొని తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని సిఎం చంద్రశేఖర్ రావు తెలిపారు. నాగార్జున సాగర్ లో ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధకేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదని సిఎం చంద్రశేఖర్ రావు తెలిపారు.
రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుజ్జీవింప చేసి ప్రపంచ బౌద్దపటంలో తెలంగాణకు సముచితస్థానాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం చంద్రశేఖర్ రావు అన్నారు. ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడడం ద్వారా మాత్రమే భగవాన్ గౌతమ బుద్ధునికి నిజమైన నివాళి అర్పించగలుగుతామని, తెలంగాణ ప్రభుత్వం అదే దిశగా ముందుకు సాగుతున్నదని సిఎం చంద్రశేఖర్ రావు అన్నారు. ఇదిలా ఉండగా గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతికోసం, సమసమాజ స్తాపన కోసం బౌద్ధం చూపిన మార్గం ఉన్నత బాటలు వేస్తుందని తెలిపారు. అహింసా మార్గంలో సిద్దించిన తెలంగాణ సమాజపు సమానత్వ నినాదం కూడా బౌద్దమత సిద్దాంతాల నుండే ఆపాదించబడిందని మంత్రి వెల్లడించారు.