కోదండరామ్ తో సహా వీరికి పదవులు ఖరారు - మంత్రివర్గ విస్తరణ పై రేవంత్ క్లారిటీ..!!
ముఖ్యమంత్రి రేవంత్ నామినేటెడ్ పదవుల భర్తీ పైన కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో తమకు మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్ కోదండరాంతో సహా సీట్లు దక్కని వారికి..హామీ ఇచ్చిన వారికి నామినేటెడ్ పదవులు ఈ నెలలోనే పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణ పైనా రేవంత్ స్పష్టత ఇచ్చారు. లోక్ సభ ఎన్నికలు తనకు బిగ్ టాస్క్ గా రేవంత్ అంగీకరించారు. రేవంత్ చేసిన ప్రకటనతో కాంగ్రస్ లో నామినేటెడ్ పదవుల ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది.
నామినేటెడ్ పదవులు: ముఖ్యమంత్రి రేవంత్ నామినేటెడ్ పదవులు..మంత్రివర్గ విస్తరణపై స్పష్టత ఇచ్చారు. తమకు ఎన్నికల సమయంలో మద్దతుగా నిలిచిన కోదండరామ్ కు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవప్రదమైన పదవిలోకి తీసుకుంటామని కాంగ్రెస్ అదిష్ఠానం అప్పట్లో హామీ ఇచ్చింది. ఈ క్రమంలో కోదండరామ్కు ప్రభుత్వ సలహాదారుగా లేదా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా లేదా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరిగింది.

అందులో భాగంగా ప్రస్తుతం భర్తీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి కోదండరాంకు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో ఉన్న వారికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు ఇస్తే గవర్నర్ అంగీకరించటం లేదని రేవంత్ వెల్లడించారు.
ప్రాధాన్యత పెంచుతాం: ఇక, ఎన్నికల సమయంలో పార్టీలో ప్రాధాన్యత పైన హామీ ఇచ్చిన వారికి నామినేటెడ్ పదవుల పైన స్పష్టత ఇచ్చారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్, పటేల్ రమేష్ రెడ్డి, వేం నరేందర్రెడ్డి, మహేష్ గౌడ్ లాంటి వారికి నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
ఈ నెలాఖరులోగానే వీరితో సహా ఎవరికి అయితే హామీ ఇచ్చామో..వారందరికీ పదవులు ఖరారు చేస్తామని ప్రకటించారు. అదే విధంగా ప్రభుత్వంలో సలహాదారులను నియమిస్తున్నట్లు వెల్లడించారు. నామినేటెడ్ పదవుల విషయంలో తాను హైకమాండ్ పైన ఒత్తిడి తెస్తున్నట్లు వివరించారు. వీరికి పదవులు ఇవ్వటం ద్వారా లోక్ సభ ఎన్నికల ముందు పార్టీలో సానుకూల సంకేతాలు ఇచ్చినట్లవుతుందని చెప్పుకొచ్చారు.
మంత్రివర్గ విస్తరణకు సిద్దం: ఇక, మంత్రివర్గ విస్తరణ పైన రేవంత్ తేల్చి చెప్పారు. తాను ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే దాని పైన స్పష్టతతో ఉన్నానన్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో మైనార్టీకి అవకాశం ఇవ్వాల్సి ఉంది.. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి కేబినెట్ లోకి తీసుకోవాల్సి ఉందన్నారు. పరోక్షంగా షబ్బీర్ అలీకి అవకాశం ఇస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే అంటే మార్చి 15వ తేదీ లోగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రేవంత్ స్పష్టం చేసారు. హైదరాబాద్ లో పార్టీ పట్టు పెంచుకొనేందుకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో నగరానికి చెందిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. గుడ్ గవర్నెన్స్ ద్వారా హైదరాబాద్ లో పట్టు పెంచుకుంటామని రేవంత్ ధీమా వ్యక్తం చేసారు.












Click it and Unblock the Notifications