అల్లు అర్జున్ కు కాలు విరిగిందా, కన్ను పోయిందా - రేవంత్ సంచలనం..!!
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. పుష్ఫ -2 ప్రీమియం షో వేళ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పైన అసెంబ్లీలో రేవంత్ ప్రకటన చేసారు. అల్లు అర్జున్ నేరుగా థియేటర్ లోకి వెళ్లి సినిమా చూస్తే తొక్కిసలాట ఉండేది కాదన్నారు. షో చేయటం వలనే అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుందని చెప్పారు. సినిమా చూస్తున్న అల్లు అర్జున్ కు తొక్కిసలాట మహిళ మరణం గురించి వివరించినా అల్లు అర్జున్ సినిమా చూసిన తరువాతనే వెళ్తానని చెప్పిన అంశాన్ని రేవంత్ చెప్పుకొచ్చారు.
అనుమతి లేకపోయినా
అల్లు అర్జున్ గురించి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అల్లు అర్జున్ పుష్ఫ -2 ప్రీమియర్ షో గురించి సంధ్యా థియేటర్ పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు. అయితే, అల్లు అర్జున్ టాప్ పైన నిలబడుతూ థియేటర్ వద్దకు వచ్చి హంగామా చేసారని చెప్పారు. థియేటర్ అనుమతి కోరిన సమయంలో సినీ ప్రముఖులు ఎవరూ థియేటర్ వద్దకు రావద్దని పోలీసులు చెప్పారని వెల్లడించారు. కానీ, ఇందుకు విరుద్దంగా హీరో అల్లు అర్జున్ వచ్చారని చెప్పారు. బౌన్సర్లు అక్కడ ఉన్న వారిని తోసుకుంటూ లోపలకు వెళ్లారని వివరించారు. అక్కడ ఉన్న జనం తప్పించుకునే క్రమంలో రేవతి తన కుమారుడిని పట్టుకొని పక్కకు వెళ్లే ప్రయత్నం చేసారని చెప్పుకొచ్చారు.

అల్లు అర్జున్ కు ఏమైంది
ఆ తొక్కిసలాటలో రేవతి గాయపడటం తో పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేసారని రేవంత్ వివరించారు. కాగా, రేవతి మరణించారని.. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారని చెప్పారు. తల్లి ప్రాణాలు విడుస్తూ కూడా కుమారుడు చేయి వదల లేదని రేవంత్ చెప్పారు. అయితే, అల్లు అర్జున్ ను పరామర్శించటానికి సినీ ప్రముఖులు వెళ్తున్నారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడుని మాత్రం పరామర్శించలేదని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ కు చేయి విరిగిందా.. కాలు పోయిందా.. కన్ను పోయిందా.. కిడ్నీ పోయిందా.. ఎందుకు పరామర్శ చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. ఒక్క రోజు హీరో పోలీసు స్టేషన్ కు వెళ్తే సినీ ప్రముఖులు కన్నీరు కారుస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.
రేవతి మరణం గురించి చెప్పినా
ఒక్క రోజు అరెస్ట్ చేస్తే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని చెప్పారు. రేవతి కుటుంబానికి ప్రభుత్వం రూ 25 లక్షల ఆర్దిక సాయం ప్రకటించింది. ఇక నుంచి బెనిఫిట్ షో లు తెలంగాణ లో ఉండవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. పోలీసులు హెచ్చరించినా హీరో సినిమాకు వచ్చారన్న సీఎంరేవంత్.. పోలీసులు ఎలాంటి లాఠీఛార్జ్ చేయలేదని వెల్లడించారు. రోడ్ షో చేయడంతోనే తోపులాట జరిగిందని చెప్పారు. హీరోకు సమాచారం ఇచ్చినా సినిమా పూర్తయ్యే వరకు బయటకు వెళ్లబోనని హీరో చెప్పారని పోలీస్ కమిషనర్ చెప్పారని అసెంబ్లీ వేదికగా రేవంత్ వెల్లడించారు. థియేటర్ బయటనుంచి వచ్చిన తర్వాత ఇద్దరు చావు బతుకుల్లో ఉన్నారని చెప్పినా రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని రేవంత్ వివరించారు.












Click it and Unblock the Notifications