తెలంగాణా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ లను ప్రకటించిన రేవంత్.. ప్రతిపక్షాలు షాక్!!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రమోషన్లు పొందిన 30 వేల మంది టీచర్లతో ఉపాధ్యాయుల సభలో మాట్లాడారు. టీచర్లే మా అంబాసిడర్లు అంటూ తెలంగాణ ప్రభుత్వానికి టీచర్లు బాసటగా నిలుస్తారని ఆయన సభా వేదికగా ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల వ్యవహారంలో తనను చాలామంది భయపెట్టారని ఉపాధ్యాయులు తేనెటీగల లాంటి వారిని ఏదైనా తేడా వస్తే తేనె తుట్టెను కదిలించినట్టేనని తనకు చెప్పారన్నారు.
తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్లు
తనకు స్వార్థం లేదని, నమ్మించి మోసం చేసే ఉద్దేశం అసలే లేదని అందుకే పదోన్నతుల విషయంలో నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజలు దొరల గడీలలో బందీ కాకూడదని పేర్కొన్న రేవంత్ రెడ్డి పేదరికం నుంచి విముక్తి కలగాలంటే చదువే మార్గమని, పేద పిల్లలకు అంకితభావంతో చదువు చెప్పే బాధ్యత మీదేనని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ వ్యాఖ్యలు చేశారు.

మీకేం కావాలన్నా బాధ్యత తీసుకుంటాం
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం నిలబడింది అన్నా, రేపు మళ్లీ గెలవాలి అన్నా ఉపాధ్యాయుల సహకారం ఉండాలని, మీకు ఏం కావాలన్నా చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని రేవంత్ పేర్కొన్నారు. ఢిల్లీలో కేజ్రీవాల్ మూడుసార్లు గెలిచారంటే కారణం పేదల బస్తీలలోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించటమేనని రేవంత్ స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉండాలంటే ఇక్కడ చదువులు బాగుండాలని దానికోసమే ఉపాధ్యాయుల విషయంలో తామీ నిర్ణయం తీసుకున్నామన్నారు.
మీ వల్లే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్
గత డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉపాధ్యాయులు శాయశక్తుల సహకరించారని, దాని ఫలితంగానే ఉపాధ్యాయుల సమస్యలు తీర్చి, పదోన్నతులు పొందిన మీతో ప్రస్తుతం సమావేశం ఏర్పాటు చేశానన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడాలని భావించామని, అందుకే బడ్జెట్లో పది శాతం నిధులు కేటాయించాలి అనుకున్నామని అయితే ఇతర హామీలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో చివరకు 7.3%నిధులను అంటే 21 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు.
స్ఫూర్తి నింపుకుని వెళ్ళండి
సర్కారు బడిలో చదువుకునే తాను సీఎం అయ్యానని పేర్కొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు ప్రజలు పిల్లలను పంపించేలాగా విద్యా వ్యవస్థ మారాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేళ్ల పాలనలో జరిగింది ఏమిటో మీకు తెలియనిది కాదని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియం నుంచి అందరూ స్ఫూర్తి నింపుకొని వెళ్లాలన్నారు.
రేవంత్ వ్యాఖ్యల ఆంతర్యం ఇదే
ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్యలో పెంచడంతో పాటు, పిల్లలను, బడులను తీర్చిదిద్దుదామని ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఉపాధ్యాయుల సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఏ ప్రభుత్వాన్ని అయినా పడగొట్టే, నిలబెట్టే సత్తా ఉపాధ్యాయులకు ఉంటుందని, అందుకే ఉపాధ్యాయులానే అంబాసిడర్లు అని ప్రకటన చేసి రేవంత్ రెడ్డి వారిని కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లాక్ చేశారని చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ భవిష్యత్ కు పునాదులు వేసిన రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వ భవిష్యత్తుకు ఉపాధ్యాయుల సభతో బలమైన పునాదులు వేశారని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలన్న ఉద్దేశంతో ఉపాధ్యాయుల పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications