కేరళ గడ్డపై సీఎం సవాల్! మా గ్యారంటీలపై డౌట్ ఉంటే తెలంగాణ రండి
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) మేనిఫెస్టోను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కొచ్చిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కేరళ సీఎం పినరాయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు సాధ్యం కావని విమర్శించే వారు తెలంగాణకు వచ్చి చూడాలని ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
కేరళ సీఎం పినరాయి విజయన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పాలనలో అనేక పోలికలు ఉన్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇద్దరూ అవినీతి, కుటుంబ పాలనలో ఆరితేరారని ఎద్దేవా చేశారు. "దేశాన్ని మోదీ పాలిస్తుంటే.. కేరళను విజయన్ పాలిస్తున్నారు. వీరిద్దరూ 'మోదీ బ్రదర్స్' లాంటి వారు" అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన ఎలాగైతే అంతమైందో, కేరళలో కూడా పినరాయి పాలన ముగిసి యూడీఎఫ్ స్వర్ణయుగం మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణే మా ట్రాక్ రికార్డు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన రూ.21 వేల కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు రూ.12 వేలు చొప్పున ఏడాదికి రూ.18 వేల కోట్లు రైతు భరోసా కింద అందజేస్తున్నామని సీఎం తెలిపారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో పాటు ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామని సీఎం వివరించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని, 10 వేల బస్సులు, 50 వేల సిబ్బందితో ఉన్న ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకువచ్చామని సీఎం తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు ఆదా అవుతోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మహిళలను బస్సుల యజమానులుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ -2047 ప్రకారం తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వృద్ధిరేటు 10.8 శాతంగా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్యమని తాము నిరూపించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
కేరళ యూడీఎఫ్ మేనిఫెస్టో: 'ఇందిర ఐదు గ్యారంటీలు'
కేరళ ఎన్నికల కోసం యూడీఎఫ్ ప్రకటించిన ప్రధాన హామీలను రేవంత్ రెడ్డి విడుదల చేశారు:
- ఉచిత ప్రయాణం: కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.
- బాలికలకు భరోసా: కాలేజీ చదువుతున్న బాలికలకు నెలకు రూ. 1,000 ఆర్థిక సాయం.
- పెన్షన్ల పెంపు: సంక్షేమ పింఛన్లను నెలకు రూ. 3,000కు పెంచుతూ నిర్ణయం.
- ఆరోగ్య బీమా: మాజీ సీఎం ఊమెన్ చాండీ పేరుతో ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా.
- యువతకు రుణాలు: స్వయం ఉపాధి కోసం యువతకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.
వీటితో పాటు వయనాడ్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, సముద్ర, విమానయాన రంగాల్లో ఐదు భారీ డ్రీమ్ ప్రాజెక్టులను మేనిఫెస్టోలో పొందుపరిచారు. కేంద్రం ఇచ్చే నిధులు మోదీ కరుణ కాదని, అది ప్రజల హక్కు అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications