తెలంగాణలో కొత్త పథకం ప్రారంభం: రూ. లక్ష ఆర్థికసాయం: విధి విధానాలు, అర్హతలు ఇవే
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఓ కొత్త పథకాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. దీనికి మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరు పెట్టింది. కొద్దిసేపటి కిందటే ఈ పథకాన్ని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
అదే- రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం. ప్రిలిమ్స్కు ఎంపికైన అభ్యర్థులకు ఉద్దేశించిన పథకం ఇది. దీని కింద ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందజేయనుంది ప్రభుత్వం. కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద సింగరేణి క్యాలరీస్ లిమిటెడ్ ఈ పథకాన్ని రూపొందించింది. అవసరమైన ఆర్థిక చేయూతను అందజేస్తుంది.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద లబ్ది పొందాలనుకునే అభ్యర్థులకు అవసరమైన అర్హతలు, కుటుంబ వార్షిక ఆదాయం, ఇతర మార్గదర్శకాలు, నిబంధనలను కూడా రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించిన గైడ్లైన్స్ను జారీ చేశారు.
లబ్ది పొందాలనుకునే వారు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) వారు కూడా దరఖాస్తు చేయవచ్చు. అభ్యర్థులు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఉండాలి.
వారి కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షల రూపాయల లోపు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ రంగ సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పని చేసే ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. అలాగే- ఈ పథకం ద్వారా గతంలో ఎలాంటి ప్రయోజనాన్ని కూడా పొందివుండకూడదు. అభ్యర్థులు వారి సివిల్స్ ప్రయత్నంలో ఒకే ఒకసారి మాత్రమే ఈ ఆర్థిక ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు.
Hon'ble CM Sri @revanth_anumula Interacts with Successful candidates of UPSC Civil Services (Preliminary) Examination 2023 & Launching of the Scheme for Financial Assistance by SCCL https://t.co/l6SVjh7ha8
— Telangana CMO (@TelanganaCMO) July 20, 2024
దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలను రాస్తోన్న వారి సంఖ్య దాదాపు 14 లక్షలుగా ఉంటోంది. ప్రతి ఏడాది తెలంగాణ నుంచి 50 వేల మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటోన్నట్లు సింగరేణి క్యాలరీస్ అంచనా వేసింది. సివిల్స్ ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులవుతోన్న వారి సంఖ్య 400 నుంచి 500 వరకు ఉంటోంది.












Click it and Unblock the Notifications