కేసీఆర్కు అవమానం జరిగిందా?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేశారన్నారు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ పదవిని త్యాగం చేసి.. 14 ఏళ్లు మడమ తిప్పని ఉద్యమం నడిపిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. అలాంటి నేత పట్ల ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు తగదన్నారు.
రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మూడు గంటలపాటు కేసీఆర్ గురించే మాట్లాడరని, ప్రజలకు ఉపయుక్తమైన విషయాలను ప్రస్తావించలేదని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ చావు కోరుతూ మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగదని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నాయకునికి గౌరవం ఇవ్వడం సాంప్రదాయంగా వస్తున్నా.. కొత్త ప్రభుత్వం వచ్చాక కేసీఆర్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నారని ఆరోపించారు.

ప్రతిపక్ష నేతకు అందించాల్సిన చాంబర్ను తొలగించడం అవమానకరమని ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడ్ని సంప్రదించకుండా పీఏసీ ఛైర్మన్గా పార్టీ మారిన వ్యక్తిని నియమించారని, ఇది నియామకాలకు విరుద్ధమని అన్నారు. ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం ఇది కాదని అన్నారు. సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పిన ప్రతి విషయంలోనూ అబద్ధాలు ఉన్నాయన్నారు.
రైతు రుణమాఫీ విషయంలోనూ సీఎం రేవంత్ అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సాధించిన విజయాలను కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లో తన ఖాతాో వేసుకోవాలని చూస్తోందని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రుణమాఫీ రెండు సార్లు అమలైందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా చేసినా బీఆర్ఎస్ కంటే 8 వేల కోట్లు తక్కువేనని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. తులం బంగారం, స్కూటీలు, పంటలకు బోనస్ వంటి హామీలను నెరవేర్చలేదన్నారు.












Click it and Unblock the Notifications