కేంద్రంతో అటో ఇటో తేల్చుకుంటాం: ఆయన నోట చంద్రబాబు మాట
One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ నిర్వహణ దిశగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి వడివడిగా అడుగులు వేస్తోంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ఈ అయిదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ను నిర్వహించబోతోన్నామనే సంకేతాలను పంపించింది.
గతంలో ఈ జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫాసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ ఇప్పటికే అందజేసిన నివేదికను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది కూడా.

పూర్తిస్థాయిలో చర్చ అనంతరం ఈ ప్రతిపాదనలను మంత్రివర్గం యధాతథంగా ఆమోదించింది. త్వరలో ఏర్పాటు కాబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. 2027లో ఏ క్షణంలోనైనా జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
దీనిపై తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్లకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అమలు చేయనివ్వబోమని తేల్చి చెప్పారు.
ఇటీవలే కన్నుమూసిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాప సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఏచూరీతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సీతారాం ఏచూరి మరణం.. వామపక్షాలకు తీరని లోటని, జాతీయ రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని రగిలించారని పేర్కొన్నారు. దేశంలో అన్ని రాజకీయ వేదికలపై తన గొంతును వినిపించడం ద్వారా పేదలకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య వేదికలపైనా దేశ ఘనకీర్తిని చాటారని చెప్పారు.
ఏచూరీ, ఎస్ జైపాల్ రెడ్డి వంటి జాతీయ స్థాయి నాయకులు దేశంలో ప్రజాస్వామ్యంలో బలోపేతం కావడంలో కీలకంగా వ్యవహరించారని అన్నారు. తుది శ్వాస విడిచే వరకు ఏచూరి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని, జీవితాంతం పేదల కోసం పోరాడారని చెప్పారు. ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రికి అందించాలన్న కుటుంబ సభ్యుల నిర్ణయం అభినందనీయమని చెప్పారు.
యూపీఏ హయాంలో పేదల సంక్షేమానికి సంబంధించిన కీలక బిల్లులకు మద్దతివ్వడంలో సీతారాం చురుకైన పాత్ర పోషించారని రేవంత్ చెప్పారు. సీతారాంను ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ తన గురువుగా భావించారని గుర్తు చేశారు. క్లిష్ట సమయాల్లో దేశానికి దిశానిర్దేశం చేసే ఏచూరి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.
జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబళించాలని అనుకుంటున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో సీతారాం ఏచూరి లేకపోవడం తీరని లోటు అని రేవంత్ చెప్పారు. ఏచూరి చూపిన మార్గంలో నడుస్తామని, జమిలి ఎన్నికలను అడ్డుకుంటామని, దీనికి వ్యతిరేకంగా పోరాడుతామని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications